(హైదరాబాద్ నుండి న్యూస్ “ఆర్బిట్” ప్రతినిధి)
పవన్ కళ్యాణ్..! రాజకీయ పార్టీ పెట్టక ముందు, పెట్టిన తరువాత కూడా టాప్ టాలీవుడ్ హీరోనే..! ఆయన రాజకీయ శైలి ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదు ! రాజకీయ పార్టీగా జనసేన స్థాపించిన తరువాత 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ కు ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ అటు తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అభిమాన సంఘాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత 2019 ఎన్నికల నాటికి వామపక్షాలు, బీఎస్ పీతో పొత్తుతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసి ఊహించని పరాజయాన్ని మూటకట్టుకున్నారు. అయినప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తునే ఉన్నారు. బీజేపీతో దోస్తీకి చేతులు కలిపారు. 2022 నాటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజెపీ, జనసేన కూటమి విజయమే లక్ష్యంగా పని చేయాలని బాసలు చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది.
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతున్న వేళ పవన్ కళ్యాణ్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా 50 కార్పోరేషన్ లకు జనసేన కమిటీలను నియమించారు. గత ఎన్నికలలో మాదిరిగా గ్రేటర్ ఎన్నికల్లో తమ హవా కొనసాగుతుందని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్నది. వందకు పైగా సీట్లు కైవశం చేసుకోవడం ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్, ఆ పార్టీ నేతలు ప్రకటిస్తూ వచ్చారు. వారు నిర్వహించిన అంతర్గత సర్వేలో ఈ విషయం వెల్లడయిందని చెప్పుకొస్తున్నారు. తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి జనసేన కాపుకాస్తే కొంత మేర ప్రభావం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో గ్రేటర్ ఎన్నికల్లో జనసేన సొంతంగా విజయాలను సొంతం చేసుకోలేకపోయినా కొన్ని స్థానాల్లో అభ్యర్థుల జయాపజయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అంటున్నారు. జనసేనను లెక్కలేసుకోకముందు టీఆర్ఎస్ అంతర్గత సర్వే చేసి వంద సీట్లు చెప్పుకుంటున్నారనీ ఇప్పుడు పరిస్థితులు మారతాయని బీజెపీ, జనసేన కూటమిగా రంగంలో ఉంటే వారు అనుకున్నన్ని సీట్లు రావని పేర్కొంటున్నారు.
ఏపి రాజకీయాల్లోనే పెద్దగా ప్రభావం చూపని జనసేనకు తెలంగాణ రాజధాని హైదరాబాదు గ్రేటర్ ఎన్నికల్లో అంత సీన్ ఉండదు అని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు అధికంగా ఉండే కొన్ని డివిజన్ లలో పవన్ కళ్యాణ్ కారణంగా బీజేపీకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. అయితే ఏపిలో తమ పార్టీ వైఖరికి భిన్నంగా బీజేపీ మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో జనసేన కొద్ది రోజులుగా మౌనం వహిస్తూ వస్తున్నది. అమరావతే ఏపి రాజధానిగా ఉంటుందని కేంద్రంలోని పెద్దలు తనకు హామీ ఇవ్వడం వల్లనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీ వైఖరి మారిపోయిన తరువాత మీడియా ముందుకు వచ్చి ఎటువంటి ప్రకటన చేయలేదు. బీజెపీతో కలిసి ఉమ్మడిగా గ్రేటర్ ఎన్నికల్లో బరిలో ఉంటారా ? లేక ఒంటరిగా పోటీ చేస్తారా? అనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 50 డివిజన్లలో జనసేన కమిటీలను ఏర్పాటు చేయడంతో ఎన్నికల బరిలో నిలవడానికే అన్న ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారుతోంది.