Janasena: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది అందరికీ తెలిసిందే. నాయకులు ఒక పార్టీ నుండి గెలిచి మరొక పార్టీలో చేరడం, అంతకు ముందు విమర్శించుకున్న నాయకులతోనే కలసి వేదికలు పంచుకోవడం, కలిసి ప్రయాణం చేయడం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా రాజకీయ పార్టీలు కూడా వారి అవసరాల మేరకు జత కట్టడం, విడిపోవడం రివాజుగా మారింది. టీడీపీ గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ మతతత్వపార్టీ అంటూ విమర్శలు చేసింది. ఆ తరువాత 2014 ఎన్నికలకు ముందు మళ్లీ కలిసింది. 2019 ఎన్నికలకు ముందు దోస్తాన్ కటీఫ్ చేసుకుంది. అదే విధంగా వామపక్షాలతోనూ టీడీపీ అదే తీరు ప్రదర్శించింది. అందుకే చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి సీపీఐ నారాయణ ఆయనకు ముద్దు వచ్చినప్పుడు చంకనెత్తుకుంటారు. ఆ తరువాత విసిరేస్తాడు అన్నట్లుగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు అదేలా ఉంది.
Janasena: తొలుత బీజేపీ, టీడీపీతో..
తొలుత బీజేపీ, టీడీపీతో ఉమ్మడిగా జనసేన సావాసం చేసింది. ఆ తరువాత విడిపోయి వామపక్షాలు, బీఎస్పీతో కలిసింది. ఆ తరువాత మళ్లీ బీజేపీతో జత కట్టారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యక్రమాలు చేస్తామని గతంలో ప్రకటించారే గానీ ఆ విధంగా కార్యాచరణకు పూనుకున్నది లేదు. ఏపిలో బీజేపీతో పొత్తుకు క్షేత్ర స్థాయి జనసైనికులే సుముఖంగా లేరన్న టాక్ నడుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలకు ముందే జనసేన – బీజేపీకి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత నాయకులు మాట్లాడుకోవడంతో వివాదం సద్దుమణిగింది. బద్వేల్ ఉప ఎన్నికల విషయానికి వచ్చే సరికి బీజేపీతో సంప్రదించకుండానే జనసేన పోటీ చేయడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పేశారు.
Janasena: ఇరుపార్టీల పొత్తు ఉన్నా..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గళం విప్పారు. అక్కడి కార్మికులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో ఇరుపార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ చాలా కాలంగా బీజేపీ – జనసేన ఎవరికి వారే కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఇప్పుడు జనసేన పూర్తిగా బీజేపీ నుండి పక్కకు జరగాలని డిసైడ్ అయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ – టీఆర్ఎస్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం, నేతల అరెస్టుల వరకూ వెళ్లింది. కేసిఆర్ ఏకంగా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ మోడీపైనే వార్ డిక్లేర్ చేశారు. కేంద్రం నుండి బీజేపీని తరిమివేయాల్సిందేనని ప్రకటించారు.
Janasena: కేటిఆర్ తో పవన్
ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మువీ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ లను ఆహ్వానించడం బీజేపీ నేతలకు రుచించడం లేదు. దానికి తోడు పవన్ అభిమానులు ఏపిలో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సందర్బంగా కేసిఆర్ ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం పుండుమీద కారం చల్లినట్లు అయ్యింది. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంలో ఏపిలో రాజుకున్న వివాదంపై టీడీపీతో సహా ఇతర పక్షాలు మాట్లాడినా జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ నేతలు మాత్రం మాట్లాడలేదు. ఈ పరిణామాలు అన్నీ గమనిస్తుంటే బీజేపీతో మళ్లీ జనసేన విడాకులకు రెడీ అయిందనే అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.