(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల బరి నుండి జనసేన తప్పుకుంది. బీజేపీకి సంపూర్ణ మద్దతు తెలియచేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న జనసేన.. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో భేటీ అయి చర్చించారు. ఈ చర్చలు ఫలప్రదం కావడంతో… గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నామినేషన్ లు దాఖలు చేసిన జనసైనికులు ఉపసంహరించు కోవాలని కోరారు. జనసేన కార్యకర్తలు నిరుత్సాహ పడవద్దు అని, బిజెపి అభ్యర్థులకు మద్దతివ్వాలని సూచించారు. బిజెపి నేత లక్ష్మణ్ మాట్లాడుతూ తాము జనసేన మద్దతు కోరామని తెలిపారు. భవిష్యత్తులోనూ జనసేన బిజెపి కలిసి పని చేస్తాయని పేర్కొన్నారు.