అమరావతి: ఏపి ఆర్థిక బడ్జెట్ చాలా పారదర్శకంగా ఉందని రాజోలు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రాపాక మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ కేటాయింపులు చేయడం చాలా అభినందనీయమన్నారు.
ఈ సందర్భంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తూ అధికార పక్షం ఏమి చేసినా గుడ్డిగా వ్యతిరేకించమని తమ నాయకుడు చెప్పలేదనీ,ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతు ఇవ్వమన్నారనీ రాపాక అన్నారు. రాపాక ఈ విధంగా మాట్లాడుతున్న సమయంలో అధికార పక్ష సభ్యులు బల్లలు చరుస్తూ అభినందించారు.