(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఎమ్మెల్యే అన్న కనీస గౌరవ మర్యాద ఇవ్వకుండా ఎస్ఐ ఇష్టానుసారంగా దుర్భాషలాడారని ఆరోపిస్తూ రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ కార్యకర్తలతో కలిసి మలికిపురం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే మలికిపురం ఎస్ఐ రామారావు పేకాట ఆడుతున్నారని పలువురుని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాపాక ఎస్ఐకి ఫోన్ చేసి వారిలో ఒక వ్యక్తి పేకాట ఆడటం లేదనీ, అతని రెండు కిడ్నీలు పాడయ్యాయని, అనారోగ్యంతో ఉన్నాడనీ, కాలక్షేపానికి అక్కడ కుర్చుంటే పట్టుకువచ్చారని అతన్ని వదిలి పెట్టాలని కోరారు. ఎస్ఐ ఒప్పుకోకపోవడంతో నేరుగా ఆయన పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఒక వేళ కేసు కట్టినా సెల్ ఫోన్లు, బైక్లు ఇచ్చి పంపించండి, రేపు కోర్టుకు హజరుపర్చే టైమ్కు వస్తారని ఎమ్మెల్యే రాపాక ఎస్ఐకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఎస్ఐ ఒక్కరినీ వదిలిపెట్టడానికి అంగీకరించలేదు. దీనికి తోడు ఎమ్మెల్యే బయటకు వెళ్లిన వెంటనే ఎమ్మెల్యే అయితే ఎంటీ గొప్పా, వాడు వీడు అంటూ ఎస్ఐ సంబోధించాడని ఎమ్మెల్యేకి అనుచరులు చెప్పడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాద కూడా లేకుండా ఎస్ఐ వ్యవహరిస్తున్నారనీ, ప్రజల ముందు హీరో ఇజం ప్రదర్శించేలా ఎమ్మెల్యేని తక్కువచేసి మాట్లాడుతున్నాడని రాపాక ఆరోపించారు.
పరుష పదజాలంతో దూషించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ముందు ఎమ్మెల్యే అనుచరులు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న డిఎస్పి ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తన అనుచరులను సముదాయించి ఎమ్మెల్యే ఆందోళన విరమింపజేసి అక్కడ నుండి వెళ్లిపోయారు.