గుంటూరు: యువత జాతీయ వాదానికి అండగా నిలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జాతీయ జండాను ఎగురవేసి పార్టీ నేతలతో కలసి వందన సమర్పణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి రెండే పెద్ద పండుగలనీ, వాటిలో ఒకటి ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, రెండవది జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకని చెప్పారు.
మనకు స్వాతంత్ర్యం వచ్చిందని చాలా తేలికగా తీసుకుంటున్నామని పవన్ అన్నారు. నేడు ప్రతి చోట ప్రాంతీయ వాదం, కుల వాదం, మత వాదం పెరిగిపోతున్నాయనీ, ఇవి పేట్రేగిపోయినప్పుడు దేశం విచ్ఛిన్నం అయిపోయే ప్రమాదం ఉందని పవన్ అవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ, కుల, మత వాదాలు పేట్రేగిపోతే మనలో మనం కొట్టుకుంటుంటామనీ, దీంతో
జాతీయ భావన, జాతీయ సమగ్రత దెబ్బతింటాయనీ పవన్ పేర్కొన్నారు. మన దేశంలో మనమే ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సిన పరిస్థితులు కూడా వస్తాయని పవన్ అన్నారు. అటువంటి అనర్థాలు జరగకుండా ఉండేందుకు ఏకైక మందు జాతీయ వాదమేనని పవన్ స్పష్టం చేశారు.
దేశాన్ని విచ్చినం చేసే వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. వాళ్లను ఎదుర్కోవాలంటే యువత జాతీయ వాదాన్ని, మానవతా వాదాన్ని వదలకూడదని పవన్ స్పష్టం చేశారు.
ప్రాంతీయతత్వానికి, కులతత్వానికి, మతతత్వానికి మన దేశాన్ని బలిచేయకుండా దేశానికి యువత జాతీయ వాదంతో అండగా నిలబడాలి పవన్ పిలుపునిచ్చారు. జాతీయ భావజాలం, మానవతావాదంతో దేశ భక్తిని అణువణువునా నింపుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా పవన్ కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ తదితర నాయకులు పాల్గొన్నారు.