ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ తెలుగుదేశం నేతలను టార్గెట్ చేస్తున్నదా? కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తెలుగుదేశం నేతలను అరెస్ట్ చేస్తున్నారా? వారు చేసిన తప్పులకు సంబంధించిన ఆధారాలు బయట పడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది జనాల నుండి.
కక్షసాధింపు చర్యే
ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై అయన సోదరుడు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి స్పందిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన చిన్నాన్న అరెస్ట్ అన్యాయం అని పేర్కొన్నారు. అసలు సూత్రధారులను ఎందుకు వదిలి వేశారని ప్రశ్నించారు. పోలీస్ విచారణకు సిద్ధంగా ఉన్నానని తెలిపినా అవసరం లేదని చెప్పిన పోలీసులు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తన చిన్నాన్న ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యే నని అయన విమర్శించారు. తమకు మోసపూరితంగా వాహనాలను విక్రయించిన అశోక్ లైలాండ్ కంపెనీపై చర్యలు తీసుకోలేదనీ, మధ్యవర్తిగా వ్యవహరించిన ముత్తు అనే వ్యక్తిని విచారణ కూడా చేయలేదనీ పవన్ రెడ్డి ఆరోపించారు.
దుర్మార్గపు పాలన
వైఎస్ఆర్ సీపి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి దుర్మార్గపు పాలన చేస్తుందంటూ దుయ్యబట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్ లను టీడీపీ తీవ్రంగా ఖండించింది. టీడీపీ నేతల అరెస్ట్ లను ఖండిస్తూ చంద్రబాబు నాయుడు పిలువు మేరకు టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మరో పక్క వారు చేసిన తప్పులు, నేరాల కారణంగానే పోలీసులు అరెస్ట్ చేశారని వైఎస్ఆర్ సీపి నేతలు పేర్కొంటున్నారు.