వరంగల్లు, మార్చి 1 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టే హోదా కావాలని యువత కోరుకుంటున్నదని మాజీ ఐపిఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. వరంగల్లు రూరల్ జిల్లాలో పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ఎపికి జోన్ ప్రకటించినట్లుగానే ప్రత్యేక హోదాపై కూడా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని లక్ష్మీనారాయణ తెలిపారు. ఎపికి ప్రత్యేక హోదా తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు.
రాజకీయాల్లోకి వచ్చే విషయంపై మాట్లాడుతూ, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే విషయంలో ఎలాంటి అనుమానమూ లేదని లక్ష్మీనారాయణ అన్నారు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తెలియజేస్తానని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
పోలీస్ వ్యవస్థను కించపరిచేలా కొన్ని రాజకీయ పార్టీలు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదనీ, ప్రజలకు న్యాయం చేసేది పోలీస్ వ్యవస్థేనని లక్ష్మీనారాయణ అన్నారు.