అమరావతి, మార్చి 14: రిటైర్డ్ ఐపిఎస్ అధికారి (జెడి) వి లక్ష్మీనారాయణ ఎన్నికలు అయ్యే వరకూ తటస్తంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల తరువాత రాజకీయ ప్రవేశం గురించి ఆలోచిస్తానని చెప్పారు. ఈ విషయాలను ఆయన సన్నిహితులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. స్వచ్చంద సేవ, ఎన్జిఒ కార్యక్రమాలపైనే ఆయన దృష్టి పెట్టనున్నారని చెబుతున్నారు.
ఆయన స్వచ్చంద పదవీ విరమణ అయినప్పటి నుండి ఆయన రాజకీయాలలో రాకపై ఊహగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మూడు రోజుల క్రితం మంత్రి ఘంటా శ్రీనివాసరావు మధ్యవర్తిత్వంగా చర్చలు జరిపారని, టిడిపిలో చేరి ఎన్నికల బరిలో నిలవనున్నారని కూడా వార్తలు వచ్చాయి.
ఆయన టిడిపిలో చేరుతున్నారు అన్న వార్తలు బయటకు రావడంతో పలువురు వైసిపి నేతలు లక్ష్మీనారాయణపై విమర్శలు గుప్పించారు. తాము మొదటి నుండి చెబుతూనే ఉన్నామనీ, చంద్రబాబే ఆయన్ను రాష్ట్రంలో హీరోగా చేశారంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే తప్పేమిటని చంద్రబాబు ప్రశ్నించారు.
టిడిపిలో లక్ష్మీనారాయణ చేరుతున్నారు అంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాజాగా ఆయన సన్నిహితుల వద్ద చెప్పిన మాటలు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి.