YS Jagan : ఎక్కడో అగ్రరాజ్యపు అమెరికా అధినేత జో బైడెన్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఫాలో అవ్వడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా…? అయితే ఇదే నిజం. ఏపీలో జగన్ అమలు చేసిన ఒక పథకాన్ని బైడెన్ ఫాలో అయ్యాడు. గతేడాది కరోనా మహమ్మారి తన ధాటిని మొదలుపెట్టిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కరోనా సోకకుండా ప్రజలను ఇంటి నుండి బయటకు రావద్దని చెబుతూనే ప్రతి ఒక్కరికి ఆదాయవ్యయాలతో మూడేసి మాస్కుల చొప్పున పంపిణీ చేశారు. దీనికోసమే 3.5 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా ఖర్చు చేశారు. జగన్ అప్పుడు తీసుకున్న నిర్ణయం అనేక ప్రశంసలు పొందింది. ఇప్పుడు అమెరికాలో కూడా కరోనా సెకండ్ విజృంభిస్తున్న తరుణంలో అధ్యక్షుడు జొ బైడెన్ ఏపీలో అమలు చేసిన పథకాన్ని అక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించారు.
దేశ వ్యాప్తంగా అమెరికన్లతో పాటు, ప్రవాసులకి కూడా ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.56 కోట్లకు పైగా దేశ వ్యాప్తంగా మాస్కులని పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు మాస్కులు ఎంతో కీలకమని యుఎస్ ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పుడో తెలిపారు.
దీంతో అమెరికాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఫుడ్ ప్యాంట్రీలు, సూప్ కిచెన్ లలో వీటిని పంపిణీ చేసేందుకు వైట్హౌస్ నిర్ణయించుకుంది. అమెరికాలో అతి తక్కువ ఆదాయం ఉన్న వారు మాస్కులని కొనుగోలు చేయలేకపోతున్నారు అని తెలుసుకున్న వారు ఈ భారీ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూడు నెలల్లో 1300 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఆరువేల ఫుడ్ ప్యాంట్రీలు, కిచెన్ హౌస్ లలో మాస్కులు పంపిణీ చేస్తామని వైట్హౌస్ తెలియజేసింది.
ఇంతకుముందు ట్రంప్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకున్నప్పటికీ ఖర్చు ఎక్కువవుతుందని వెనుకడుగు వేశారు. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న ఈ పరిణామం జగన్ సర్కారు చేపట్టిన పథకాన్ని గుర్తు చేయడం విశేషం.