బిజెపి సీనియర్ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇక లేరన్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా ఆయన తుదిశ్వాసను విడిచారు. గత నెల రోజులుగా మాణిక్యాలరావు కరోనాతో పోరాడారు. ఫోటోగ్రాఫర్ గా తన కెరీర్ ను ఆరంభించిన మాణిక్యాలరావు మంత్రి స్థాయి వరకూ ఎదిగారు.
మొదటిసారికే చంద్రబాబు హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా సేవలందించారు మాణిక్యాలరావు. ఆయన మృతి బిజెపికు తీరని లోటని చెప్పవచ్చు. పార్టీ శ్రేణులు, అభిమానులు, పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
పైడికొండల సుబ్బారావు, రంగనాయకమ్మ దంపతులకు 1961లో జన్మించారు మాణిక్యాలరావు. పిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరిన మాణిక్యాలరావు, ఎమర్జెన్సీకు వ్యతిరేకంగా అజ్ఞాతంగా పోరాడారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుండి అనుబంధాన్ని కొనసాగించారు మాణిక్యాలరావు.
1998 లోక్ సభ ఎన్నికల్లో కృష్ణంరాజు గెలుపుకు విశేషంగా కృషి చేసారు మాణిక్యాలరావు. అప్పుడు ఆయన బిజెపి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడం స్థానానికి పోటీ చేసి గెలుపొందారు మాణిక్యాలరావు. అంతే కాకుండా ధర్మదాయ శాఖ మంత్రిగా విశేష సేవలందించారు.
సేవా కార్యక్రమాలలో కూడా మాణిక్యాలరావు ఎప్పుడూ ముందుండేవారు. పలు ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు చేరువయ్యారు. ఆయనకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు. గత నెలలో కరోనా మహమ్మారి సోకినా ఎంతో ధైర్యంగా ఉన్నారు. తనకు తగ్గిపోతుందని, మళ్ళీ తిరిగి వస్తానని హామీ ఇచ్చారు. బిజెపి శ్రేణులు కూడా ఆయనకు తగ్గి మళ్ళీ తిరిగి వస్తారని ఎదురుచూసారు. అయితే ఈరోజు ఆయన మహమ్మారి వల్లనే కన్నుమూశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?