ఆంధ్ర ప్రదేశ్ పాలనా వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం అధికమైందని వ్యాఖ్యలు వస్తున్నాయి.ప్రభుత్వానికి దాదాపు ప్రతి విషయంలోనూ హైకోర్టు నుండి వ్యతిరేక తీర్పులు రావటం
ఒక విషయమైతే అతి చిన్న విషయాలను కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకుని వ్యాఖ్యలు చేస్తుండడం న్యాయ నిపుణులనే ఆశ్చర్యపరుస్తోంది.ఇదే పరిస్థితి కొనసాగితే ముందు ముందు ఇతర వ్యవస్థలు బలహీనపడే ప్రమాదం పొంచి ఉంది.న్యాయవ్యవస్థను తప్పు పట్టాల్సిన అవసరం లేదు గానీ కోర్టులు కూడా తమ పరిధిని గుర్తుంచుకుంటే మంచిదంటున్నారు న్యాయ కోవిదులు! ఉదాహరణకి ముఖ్యమైన రాజధాని విషయం కోర్టుని ఆశ్రయించటం వరకూ సబబే నైనా ప్రభుత్వ గెస్టు హౌస్ కట్టటం పైన కూడా కోర్టులు జోక్యం చేసుకోవటం అతి చొరవ కిందకే వస్తుంది.
మీడియా వార్తలు చూస్తే ప్రభుత్వ గెస్టు హౌస్ కి అయిదు ఎకరాలు చాలు కదా ముపై ఎకరాలు ఎందుకు అని కోర్టులు ప్రశ్నిస్తే …దీని మీద రేపొద్దున ఒక గెస్టు హౌస్ లో ఎన్ని గదులు ఉండాలో కూడా కోర్టులే నిర్ణయిస్తాయా అన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి! ఇది న్యాయ వ్యవస్థ అతి చొరవ కి నిదర్శనంగా గోచరిస్తోంది. అంతమాత్రాన ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించకూడదని కాదు. కొన్ని నిర్ణయాలు కోర్టుల పరిధిలోకి ఎలా వస్తాయో అర్ధం కావటంలేదు.ముందు ముందు ఇది ఆనవాయితీగా మారి కార్యనిర్వాహక అధికారాలకు ఆటంకాలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక రాజధాని విషయానికొస్తే దీనిపై హైకోర్టు త్వరగా విచారణ చేపట్టాలి గానీ వాయిదాలమీద వాయిదాలు వేయటం మంచి సంప్రదాయం కాదు. మనకు నచ్చినా నచ్చక పోయినా రాజధాని అంశం శాసన వ్యవస్థకు సంబంధించిన అంశం. న్యాయ వ్యవస్థ శాసించ జాలదు. రాజధాని ని అమరావతి లో పెట్టాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా శాసన వ్యవస్థ కి సంబందించిందే. అటువంటప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని గౌరవించి వుండాల్సింది. పార్టీలు వేరైనా ప్రభుత్వం అదే కదా! ఆ నిర్ణయం మార్పు మంచి సంప్రదాయం కాదు.
కాకపోతే శాసన వ్యవస్థనే తిరిగి వికేంద్రీకరణ పేరుతో నిర్ణయాన్ని మార్చిన తర్వాత చేయగలిగింది లేదు. ఒకవేళ శాసన మండలి నిర్ణయం సాంకేతికంగా వివాదాస్పదం అయిందనుకున్నా కోర్టులు దానిపై విచారించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది శాసన వ్యవస్థ కి సంబంధించినదీ, అతి ముఖ్యమైనదీ కాబట్టి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. జుడిషియల్ యాక్టివిజ౦( న్యాయవ్యవస్థ అతి చొరవ) తారా తారా స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది!