సూర్యగ్రహణం… ఖగోళంలో జరిగే అద్భుత ఘట్టం. ఏడాది పొడవునా ఎన్నో గ్రహణలు వచ్చినా మనకు కనపడేవాటినే మనం పరిగణనలోకి తీసుకుంటాం. జూన్ 21 ఆదివారం తేదీన అమావాస్, సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణాన్ని చూడామణి నామక సూర్యగ్రహణం అంటారు. ఈ సూర్యగ్రహణం రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదనే అంశంపై మన దేశంలో అనేక నియమాలు ఉన్నాయి. వాటి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం…
గ్రహణాల సమయాల్లో అన్ని ఆలయాలను మూసివేస్తారు. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం మాత్రం దీనికి మినహాయింపు.
గ్రహణ సమయం- విశేషాలు
జూన్ 21 ఉదయం 12.08 శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం . మృగశిర -4 , ఆరుద్ర -1 పాదాలు మిథున రాశి లో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తోంది.
గ్రహణ ఆరంభకాలం : ఉ.10.25
గ్రహణ మధ్యకాలం : ఉ.12.08
గ్రహణ అంత్యకాలం : మ . 1.54
గ్రహణ ఆద్యంత పుణ్యకాలం 3 గంటల 29 నిమిషాలుగ్రహణ నియమాలు
గ్రహణం ఎక్కడెక్కడ కన్పిస్తుంది ?
ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక , ఆఫ్రికా మొదలైన ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపిస్తుంది.
ఎవరు చూడరాదు ?
ఈ గ్రహణం ఏ నక్షత్రాలలో ఏర్పడుతుందో వారు ఈ గ్రహణం చూడకూడదని పండితులు పేర్కొంటున్నారు. ఆ నక్షత్రాలు… మృగశిర, ఆరుద్ర, నక్షత్రముల వారు , మిథునరాశి వారు ఈ గ్రహణం అసలు చూడరాదు.
గ్రహణం నాడు నియమాలు ఇవే !
గ్రహణం రోజు అనగా జూన్ 21న ఆదివారం నాడు ఉదయం 7 గంటల లోపు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఉదయం 8 గంటల లోపు తినవచ్చు. అది కూడా “అల్పాహారాన్ని” మాత్రమే తీసుకోవాలి. ఈ గ్రహణం మిధున రాశి వారు మృగశిర, ఆరుద్ర నక్షత్ర జాతకుల వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రహణం చూడరాదు.
గ్రహణపట్టు విడుపుస్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం ఆచరించి, మంత్రానుష్టానములను నిర్వహించుకొవచ్చును.
గ్రహణం సమయంలో ఎవరి నక్షత్రజపం వారు చేసుకోవచ్చు. లేదా మీకు ఏదైనా మంత్రానుష్టానం ఉంటే ఆ మంత్రం జపం చేసుకోవచ్చు. లేదా సూర్యగాయత్రి మంత్రం జపం చేసుకోవచ్చు. లేదా శివపంచాక్షరీ, రామనామం, వేంకటేశ్వర అష్టాక్షరి ఇలా ఎవరికి ఏది ఇష్టమో వారు అది జపించడం మంచిది. గ్రహణానంతరం స్నానమునకు, దేవతా విగ్రహాల శుభ్రతకు ప్రత్యేకతలు లేవు యధావిధిగా చేసుకోవడమే.
ఏం దానం చేయాలి ?
గ్రహణం మిధున రాశి వారు మృగశిర, ఆరుద్ర నక్షత్ర జాతకులు కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది. కర్మ సిద్ధాంతం నమ్మేవారు కింద చెప్పిన విధంగా దానాలు చేస్తే దోష తీవ్రత తగ్గుతుంది. గ్రహణం రోజు లేదా తెల్లవారి రోజున దేవాలయం లేదా దగ్గరిలోని పండితులకు బియ్యం, గోధుమలు, మినుగులు, అవకాశముంటే వెండి సర్ప ప్రతిమలు 2 మాత్రం దానం చేయడం మంచిది. పేదలకు పండ్లు, బియ్యం,గోధుమలు ఇవ్వడం కూడా మంచిదే. అమావాస్య కావున బ్రహ్మణేతరులు పెద్దల పేరున స్వయం పాకం ఇవ్వచ్చు. ఎవరి శక్తి అనుసారం వారు దానం చేయాలి.