ప్రపంచదేశాలన్నిటిని ఒకేసారి భయబ్రాంతులకు గురి చేసిన కరోనా మహమ్మారికి 2020వ సంవత్సరం చరిత్రలో నిలవనున్నది. మహమ్మారికి సాక్ష్యంగా ఉన్న ఈ సంవత్సరం, ఇప్పుడు ఒక అద్భుతంతో 800 ఏళ్ళ నాటి చరిత్రను తిరిగి రాయనుంది.ఈ నెల 21 న ఆకాశంలో అత్యద్భుతం జరగబోతోంది. అలాంటి దృశ్యం ఇప్పట్లో మళ్లీ రాదు. అందుకే… ఆ అరుదైన దృశ్యాన్ని తప్పక చూసేందుకు ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఉన్నారు.
మన విశ్వం ఎన్నో అద్భుతాల సంగమం. సౌరకుటుంబం గురించి తెలుసుకునే కొలదీ ఎన్నో అద్భుతాలు కనిపిస్తూనే ఉంటాయి. సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరగడం.. వాటి కక్ష్యల్లో అవి తిరుగుతూనే ఒక్కోసారి దగ్గరగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు రెండు గ్రహాలు అతి దగ్గరకు రానున్నాయి. ఈ నెల 21న గురు శని గ్రహాలు అత్యంత దగ్గరగా రాబోతున్నాయి రెండూ కలిసి ఓ పెద్ద నక్షత్రం లో దర్శనం ఇవ్వనున్నాయి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల తరువాత ఈ సంయోగం జరుగనుంది అని ఎంపీ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ దెబీ ప్రసాద్ డ్యూయరీ తెలిపారు.
అసలు ఏంటి ఈ సంయోగం:
మీరు రోజూ రాత్రి వేళ ఆకాశాన్ని గమనిస్తున్నట్లైతే… మీకు నాలుగు గ్రహాలు, నక్షత్రాల వలె మామూలు కళ్లకే కనిపిస్తాయి. రాత్రి 7 తర్వాత తూర్పు వైపున ఎరుపు రంగులో మెరుస్తూ అంగారక గ్రహం కనిపిస్తుంది. అదే సమయంలో నడి నెత్తిపై నుంచి కాస్త పశ్చిమం వైపు చూస్తే బాగా మెరుస్తూ ఓ గ్రహం కనిపిస్తుంది. అదే గురు గ్రహం. ఈ గురుగ్రహానికి పక్కనే ఎడమవైపున అంత కాంతి వంతంగా లేకుండా శనిగ్రహం కనిపిస్తుంది. ఇక తెల్లవారు జామున 3 నుంచి 6 లోపు తూర్పు వైపును అత్యంత కాంతివంతంగా శుక్రగ్రహం కనిపిస్తుంది. ఇవి గ్రహాలు, కాబట్టి ఇవి రోజూ కొద్దికొద్దిగా వాటి పొజిషన్ మార్చుకుంటూ వెళ్తుంటాయి. అయితే తొలిసారిగా శని బృహస్పతి రెండుగ్రహాలు కలిసి ఒకేచోట డబుల్ ప్లానెట్ గా దగ్గరగా కనిపించ నున్నాయి. డిసెంబర్ 21న సూర్యాస్తమయం సమయంలో సాయంత్రం 6 గంటల తరువాత ఈ అరుదైన దృశ్యాన్నిటెలిస్కోప్ ద్వారా చూడవచ్చు, అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమిపై నుంచి రాత్రి ఆకాశంలో చూస్తే బృహస్పతి శని గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా కనిపిస్తాయి. ఇలా ఈ రెండు గ్రహాల మధ్య కలయిక చాలా అరుదుగా సంభవిస్తుంటుంది. 1226 సంవత్సరంలో మార్చి 4న తెల్లవారుజామున ఆకాశంలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఆ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పుడు దీనిని చూడడం మిస్సయితే మళ్ళి 15 మార్చ్ 2080 నాటికీ గాని చూడలేము అంటున్నారు నిపుణులు.
క్రిస్మస్ కి నాలుగు రోజుల ముందు డిసెంబర్ 21న జరగబోయే అంతరిక్ష పరిణామాన్ని క్రిస్మస్ మిరాకిల్ (క్రిస్మస్ అద్భుతం) అని పిలుస్తున్నారు, కొంత మంది. ఈ రెండూ కలిసి ఓ పెద్ద భారీ నక్షత్రంలా కనిపించనందున, ఈ దృశ్యాన్ని క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ మిరాకిల్ అంటున్నారు.