Justice Kanagaraj: రిటైర్డ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ కు ఏపి ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏపి పోలీస్ కంప్లైంట్ అథారిటీ (పీసీఏ) ని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా జస్టిస్ కనగరాజ్ ను నియమించింది. ఈ మేరకు ఏపి ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
గత సంవత్సరం ఎస్ఈసీగా నియామకం అయిన కనగరాజ్ ఊహించని పరిణామాల నేపథ్యంలో పదవిని కోల్పోయిన సంగతి విదితమే. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఏపి సర్కార్ మళ్లీ సముచిత స్థానం కల్పించింది. ఈ పదవిలో జస్టిస్ కనగరాజ్ మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. అథారిటిలో మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించనున్నది. జిల్లా స్థాయిలోనూ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది.
పోలీసులపై వచ్చే ఫిర్యాదులన విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పీసీఏలను ఏర్పాటు చేశాయి. తెలంగాణలో సైతం ఈ సంవత్సరం జనవరిలోనే పీసీఏను ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని చైర్మన్ గా నియమించాలన్న సుప్రీం కోర్టు నిబంధన మేరకు ఏపి ప్రభుత్వం జస్టిస్ కనగరాజ్ ను పీసీఏ చైర్మన్ గా నియమించింది.