డిల్లీ, జనవరి 12: సిబిఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఏమీ లేవని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎకె పట్నాయక్ అన్నారు. ఒక ఇంగ్లీషు న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర నిఘా సంస్థ (సివిసి) చేపట్టిన విచారణను పర్యవేక్షించిన పట్నాయక్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సుప్రీంకోర్టు సూచనల మేరకు పట్నాయక్ ఆ దర్యాప్తును పర్యవేక్షించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ చాలా హడావుడిగా నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే వర్మపై దర్యాప్తు జరిగిందని పట్నాయక్ అన్నారు.