అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.
తమ పార్టీ తరుపున 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో నామినేషన్ వేయాలని భావిస్తే, కేవలం 75 స్థానాల్లో మాత్రమే వేయగలిగామని పాల్ పేర్కొన్నారు. వీటిలో కూడా చాలా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని పాల్ విచారం వ్యక్తం చేశారు.
చివరి నిమిషంలో తమ పార్టీ ఆఫీసులోని స్టాంపులు, బి-ఫామ్స్ను ఎవరో దొంగిలించడం వల్లనే అన్నిచోట్ల నామినేషన్లు వేయలేకపోయామని పాల్ అంటున్నారు.
దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామనీ, నేడు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తున్నామని కేఏ పాల్ వెల్లడించారు.
ప్రజాశాంతి పార్టీ తరపున నామినేషన్లు వేసి తిరస్కరణకు గురైన అభ్యర్థులు తనకు సమాచారం అందిస్తే దాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని పాల్ తెలిపారు.
అలాగే ప్రజాశాంతి పార్టీ పోటీలో లేని స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులెవరైనా ఆసక్తి చూపితే వారిని తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటిస్తామని పాల్ పేర్కొన్నారు.