ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ 2019 ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా అప్పుడు జరిగిన ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొన్న కెఎ పాల్ వింత వింత చేష్టలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో అమెరికా దేశం గా మారుస్తా అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేసేవారు. అప్పట్లో కె ఏ పాల్ చేసిన చేష్టలు ఏపీ పొలిటికల్ రంగంలో పెద్ద కామెడీ గా ఉండేవి.
ఇదిలాఉంటే ఓడిపోయిన తర్వాత అమెరికా కి వెళ్లి పోయిన కే ఏ పాల్ అక్కడినుండి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెలుగు రాజకీయాల గురించి తన అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని నెటిజన్లు ప్రశ్నించగా కె ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే 2008వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినా తర్వాత అది విలీనమయ్యే పార్టీ అని ముందే చెప్పాను అంటూ సెటైర్లు వేశారు.
ఆ తరువాత 2014 ఎన్నికల్లో మోడీ వెనకాల తిరిగారు పెద్దగా పని కాలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ప్రధాని మాయావతి అవుతుందని ఆమె పాదాలపై పడ్డారు. అయినా పెద్దగా ఏమీ కుదరలేదు. కనీస ఓట్లు రావట్లేదు, పవన్ కళ్యాణ్ జీరో అయిపోయారు అంటూ కె ఏ పాల్ సెటైర్లు వేశారు. ఇప్పుడు ఎటు దారి లేక అప్పట్లో బీజేపీని తిట్టి మళ్ళీ ఇప్పుడు అదే నీడ కింద పవన్ కళ్యాణ్ ఉంటున్నారు… ఇన్నిసార్లు పార్టీ మారితే విలువ అసలు ఉంటుందా..? మీ అభిమానులు ఎంత బాధ పడతారు..? ఎందుకు ఇలాంటి పొత్తులూ డైరెక్టుగా బీజేపీలో జాయిన్ అయిపోవచ్చు కదా. ఇలా ఎన్ని సార్లు మారుతారు. బడుగు బలహీన వర్గాల పేరుతో మోసం చేయకూడదు. రాజకీయాలలో ఒక పాలసీతో ముందుకు సాగాలి. పవన్ రాజకీయ అడుగులు చాలా విచారకరంగా ఉన్నాయి అంటూ కే ఏ పాల్ తాజాగా సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.