రాజకీయాల్లో ఈ రోజుటి మిత్రుడు…. రేపు శత్రువు అవుతాడు. తండ్రి కొడుకులే వేర్వేరు పార్టీలకు మారడం ఎన్నో సందర్భాల్లో చూశాం. అలాంటిది ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కొట్టుకోవడంలో పెద్ద వింత ఏమీ లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో నెలకొంది. వివరాల్లోకి వెళితే….
చరిత్ర ఇది..!
ప్రత్తిపాడు నియోజకవర్గంలో టిడిపి వైసిపి కాపు నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. నిజానికి వారి ప్రత్యర్దులయినా…. ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు పెద్దగా విభేదాలు పెట్టుకోరు కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి వేరే. ఈ కాపు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే ఈ నియోజకవర్గంలో పర్వత, వరుపుల కుటుంబాల ఆధిపత్యం ఎప్పటినుండో ఉంది. ఎక్కువ వరుపుల కుటుంబం ఉంది నాలుగు తరాల నాయకులు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపు గుర్రాలు అయ్యారు. ఇదే సమయంలో పర్వయ కుటుంబం నుండి రెండు తరాల నాయకులు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. అందుకే ముందు నుండి రెండు కుటుంబాల మధ్య బంధుత్వాలు కూడా ఉండడంతో కలిసిమెలిసి రాజకీయాలు చేస్తున్నారు
ముందంతా ఒకే..! ఇప్పుడేమైంది?
వాస్తవానికి ఇరుపక్షాల గతంలో కాంగ్రెస్ టీడీపీ లో ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ వెళ్లి వైసీపీ వచ్చినా ఈ కుటుంబాల మధ్య సంబంధాలు సజావుగానే సాగింది. యువ నేతలు రాజకీయ రంగ ప్రవేశం తో పరిస్థితి మారిపోయింది. పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు. అదే సమయంలో వరుపుల రాజా గత ఎన్నికల్లో టిడిపి పార్టీ నుండి టిక్కెట్ సంపాదించి ఓడిపోయారు. గెలుపోటములు సహజమే అయినా కూడా ఇక్కడ ఆధిపత్య ధోరణి ప్రదర్శించడమే వివాదాలకు దారి తీసింది.
మంట చల్లారేనా?
ప్రస్తుతం పరిస్థితి విషయానికి వస్తే వరుపుల రాజా గతంలో టిడిపి హయాంలో డిసిసిబి చైర్మన్ గా ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయని విచారణ చేయించాలని ఒత్తిడి పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో జగన్ కూడా విచారణకు ఆదేశించారు. విజయం సాధించిన తర్వాత పర్వత జగన్ సాయంతో 20 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు తేల్చారు. వివిధ కేసుల్లో రాజా పేరును చేర్చి అరెస్ట్ కి రంగం సిద్ధం చేయగా హైకోర్టు వెళ్ళిన రాజా అరెస్టుపై స్టే తెచ్చుకున్నారు. ఇక అప్పటినుండి వివాదాలు ముదిరిపోయి ఇద్దరు కాపు నాయకులు కొత్త తలనొప్పి కావడంతో.. కాపు టిడిపి-వైసిపి నేతలు రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ ఫలితం మాత్రం తేలడంలేదు.