(కడప నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కడప మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ పారిశ్రామికవేత్త కందుల శివానందరెడ్డి (73) కన్నుమూశారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన గుండె పోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. కడపలో ప్రముఖ విద్యాసంస్థగా పేరొందిన కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల అధినేతగా ఆయన సుపరిచితులు. కొద్ది రోజుల క్రితం ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగింది. ఈ సందర్భంగా గత నెలలో ఆయనను కడప ఎంపి అవినాష్ రెడ్డి పరామర్శించారు.
కందుల శివానందరెడ్డి తండ్రి ఓబులరెడ్డి కడప పార్లమెంట్ సభ్యుడుగా పని చేశారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన శివానందరెడ్డి 1989లో కడప అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ తరపున 2004,2009 ఎన్నికల్లో పోటీ చేసిన శివానందరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
కడప జిల్లాలో వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యతిరేక వర్గంగా శివానందరెడ్డి కొనసాగారు. వైఎస్ మరణానంతరం శివానందరెడ్డి కొంత కాలం వైసీపీలో కొనసాగారు. గతంలో కడప పార్లమెంట్ స్థానం నుండి వైఎస్ రాజశేఖరరెడ్డిపై శివానందరెడ్డి సోదరుడు రాజమోహనరెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైయ్యారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివానందరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన సోదరుడు, పారిశ్రామికవేత్త కందుల రాజమోహనరెడ్డి బీజేపీలో కొనసాగుతున్నారు.