Kadapa: కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ పరిధిలో ముగ్గురాయి గనుల్లో నిన్న జరిగిన భారీ పేలుళ్లలో పది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ మృతుల కుటుంబాలకు తక్షణ పరిహారంగా పది లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.5 లక్షల సాయం అందిస్తున్నట్లు చెప్పారు. క్వారీ నిర్వహకుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందన్న మంత్రి పెద్దిరెడ్డి దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని తెలిపారు.
అయిదు ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. అయిదు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందుతుందన్నారు. క్వారీ లీజుదారునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. పేలుడు పదార్ధాల అన్ లోడింగ్ నిబంధనలను క్వారీ నిర్వహకులు పాటించలేదని ప్రాధమిక విచారణలో తేలిందన్నారు.
ముగ్గురాయి గనుల్లో తవ్వకాలు నిర్వహించేందుకు గానూ వేంపల్లె నుండు కారులో భారీగా జిలెటన్ స్టిక్స్ తీసుకువచ్చి వాటిని కూలీల సహాయంతో భద్రతా చర్యలు పాటించకుండా దింపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.