ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ పుల్వామా ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావటంతో ఆయన పార్టీ సంజాయిషీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేపట్టడం లేదంటూ కమల్ ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీంతో ఆయన పార్టీ వివరణ ఇచ్చింది. తమ పార్టీ అధినేత అయిన కమల్ మాటలను అపార్థం చేసుకున్నారంటూ ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ పార్టీ భారత సైనికులతో భుజం భుజం కలిపి నిలుస్తుందని… కశ్మీర్ భారత దేశంలో అంతర్భాగమేనని నమ్ముతున్నామని స్పష్టం చేసింది. మూడు దశాబ్దాల క్రితం ప్రచురించిన ఓ మ్యాగజైన ఆర్టికల్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని.. ఇవాళ నెలకొన్న పరిస్థితి ఆ పుస్తకానికి సంబంధం లేదని మక్కల్ నీది మయ్యం పేర్కొంది.
చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమల్…పుల్వామా ఘటన గురించి మాట్లాడుతూ…‘‘మరణించడానికి సైనికులు కశ్మీర్కు వెళ్తున్నారని ఎవరైనా అన్నప్పుడు నేను చాలా బాధపడతాను. సైనిక వ్యవస్థ అన్నది పాత కాలపు పద్ధతి. ప్రపంచం వేగంగా మారుతోంది. ఒకప్పుడు ఆహారం కోసం కొట్టుకున్న మనం ఇక అలాంటి ఘటనలు జరగవని ఎలా నిర్ధరణకు వచ్చామో..అలాగే దేశాల మధ్య యుద్ధాలు కూడా అంతమవ్వాలి. గత పదేళ్లలో నాగరితకత మనకు ఈ అంశాలు నేర్పలేదా?’’ అని కమల్ వ్యాఖ్యానించాడు. ‘‘ పుల్వామా ఘటన చాలా బాధాకరం. కశ్మీర్ లో ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలి. కానీ అలా ఎందుకు చేయడం లేదు? దేని వల్ల భయపడుతున్నారు? మరోసారి ప్రజల్ని ఎందుకు అడగరు?. వారు దేశాన్ని విభజించాలనుకుంటున్నారు. ఇప్పుడు కశ్మీర్ భారత్లో భాగం’’ అని కమల్ కేంద్రాన్ని ఉద్దేశించి అన్నాడు. గత కొంత కాలంగా జమ్మూ,కాశ్మీర్ లోని వేర్పాటవాదులు ఇదే తరహా డిమాండ్ను చేస్తున్నారు. కమల్ కూడా ఇదే డిమాండ్ చేయడంతో కలకలం చెలరేగింది.దీంతో పార్టీ స్పందించింది. అలాగే కమల్ పాక్ ఆక్రమిత కశ్మీర్ ని ఆజాద్ కశ్మీర్ గా అభివర్ణించాడు. అంతేకాకుండా తాను మయ్యం మ్యాగజైన్ రాస్తున్నప్పుడు..కశ్మీర్ వివాదం ఎంత వరకు దారి తీస్తుందో అప్పుడే రాశా అన్నాడు.