ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా ఒక సినిమా మొదలయ్యాక అవాంతరాలు సహజంగా వస్తుంటాయి. అది భారీ తారాగణం, భారీ బడ్జెట్ సినిమా విషయంలో ఇంకా సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. కొంత షూటింగ్ జరిగాక గనక సినిమాకి బ్రేక్ పడితే ఇక ఈ ప్రాజెక్ట్ గురించి జనాలలో గాని, సోషల్ మీడియాలో గాని రక రకాల రూమర్స్ రావడం సహజం. అలాంటి రూమర్సే ఇప్పుడు ఒక భారీ పాన్ ఇండియన్ సినిమా విషయంలో వస్తున్నాయంటున్నారు.
లోకనాయకుడు కమల్ హాసన్ – క్రియోటివ్ జీనియస్ శంకర్ ల కలయికలో రూపొందుతున్న సినిమా ‘ఇండియన్ 2’. 23 ఏళ్ల క్రితం వచ్చి ఊహించని విధంగా సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ స్థాయిలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతుంది. అందుకే ఈ సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలు నెలకొనడం తో పాటుగా దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు ఉన్నారు.
కాగా ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచే అవాంతరాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ముందు బడ్జెట్ విషయంలో దర్శక, నిర్మాతల మధ్య విబేధాలు తలెత్తడంతో బడ్జెట్ కొన్ని చర్చల అనంతరం దర్శకుడు ఇచ్చిన బడ్జెట్ లో సగానికి సినిమా పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత సెట్లో ప్రమాదం జరగడం, ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ తో సినిమా పూర్తిగా ఆగిపోయింది.
అయితే 7 నెలల తర్వాత తిరిగి అన్ని సినిమాల షూటింగ్స్ మొదలవుతున్న క్రమంలో ఇండియన్ 2 గురించి మాత్రం మేకర్స్ నుంచి అప్డేట్స్ ఏవీ రావడం లేదు. ఇక కమల్ హాసన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కొత్త సినిమా కమిటయినట్టు అధికారకంగా ప్రకటన వచ్చింది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ‘ఇండియన్ 2’ ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. కాని అందులో వాస్తవాలు లేవని భారీ క్రూతో షూటింగ్ జరపాల్సి ఉండటంతో ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతులు కోరుతున్నట్టు, అందుకే ఆలస్యమవుతోందని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దాంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టినట్టయింది.