దేశంలో ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకూ లేని విధంగా మొట్టమొదటి సారిగా మూడు రాజధానుల కాన్సెప్ట్ను ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలన్న సంకల్పంతో సీఎం జగన్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం, ఆ తరువాత గవర్నర్ ఆమోదముద్ర వేయడం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో నడుస్తుండటంతో పరిపాలనా రాజధాని విశాఖకు తరలింపునకు ఆలస్యం ఏర్పడుతోంది. ఇక్కడ మూడు రాజధానుల అంశంపై భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి.
అయితే తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్కి ఏపి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం బాగా నచ్చినట్లు ఉంది. అక్కడ కూడా రెండవ రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. 2021 తమిళనాడులో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి రెండవ రాజధానిగా మధురైని చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారాన్ని మధురై నుండి ప్రారంభించిన కమల్ హాసన్ అక్కడ బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్ షో నిర్వహించారు. తేని, దిండుగల్ పర్యటించి పలు వర్గాలతో చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంలోనే పలు కీలక కామెంట్స్ కూడా చేశారు కమల్ హాసన్. తమ పార్టీ గెలిస్తే మధురైని రెండవ రాజధానిగా చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు త్వరలో థర్డ్ ప్రంట్ కు ఓ రూపాన్ని ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందించడమే తన లక్ష్యమని తెలిపారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై మీడియా ప్రశ్నించగా రజనీ నుండై ఎటువంటి ప్రకటన వస్తుందో వేచి చూస్తున్నాననీ, ఆ తరువాత రజనీని తప్పకుండా కలుస్తానని చెప్పారు కమల్ హాసన్. తమిళనాడు రాష్ట్ర రాజధానిగా చెన్నై ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కమల్ హాసన్ మధురైని రెండవ రాజధానిగా చేస్తామన్న ప్రకటనతో అక్కడ సెంటిమెంట్ కమల్ పార్టీకి ఏమైనా వర్క్ అవుట్ అవుతుందో లేదో వేచి చూడాలి.