Kangana Ranaut : బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిపోయింది. దేశంలోని ఏ విషయం పైన అయినా తనదైన శైలి లో అవతల వారిపై విరుచుకుపడుతున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఈ మధ్యనే ఒక ట్వీట్ వేసింది. ప్రపంచంలోనే తనలా నటించే నటి లేదని…. యాక్టింగ్ లో తాను ప్రదర్శించే వైవిధ్యం ఎవరూ ప్రదర్శించలేరని గొప్పలకు పోయింది. అలాగే హాలీవుడ్ లో అనేక సార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయి. అనేక సార్లు అవార్డు కూడా పొందిన గొప్ప నటీమణులతో ఆమె పోల్చుకోవడం గమనార్హం.
ఇప్పుడు కంగనా రనౌత్ మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. అతిలోక సుందరి శ్రీదేవి తర్వాత యాక్టింగ్ లో తానే గొప్ప అని చెప్పుకొచ్చింది. సినిమాలలో కామెడీ సీన్ లలో శ్రీదేవి తర్వాత ఆ స్థాయిలో నటించే సత్తా తనకు మాత్రమే ఉందని ప్రకటించుకుంది. 3 సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న కంగనా నటించిన ‘తను వెడ్స్ మను’ చిత్రం బాలీవుడ్ లో విడుదలై నేటికి పది సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వేసింది ఈ బోల్డ్ బ్యూటీ.
ఈ సినిమా తనకు కొత్త పాఠాలు నేర్పింది అని చెప్పింది కంగనా రనౌత్. 2011లో విడుదలైన ఈ సినిమాకు 2015లో సీక్వెల్ కూడా వచ్చింది. ఈ సినిమాలో కంగనా ‘ద్విపాత్రాభినయం’ చేసింది. ఇక సినిమా రిలీజ్ పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ వేసింది. “ఈ సినిమాకి ముందు ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశాను కానీ ఈ సినిమా నన్ను నటిగా మరొక విధం గా మార్చింది. ఇందులో తొలిసారి నేను కామెడీ తో లీడ్ యాక్టర్ గా చేశాను. నా కామెడీ టైమింగ్ కూడా చక్కగా కుదిరింది. లెజెండరీ నటి శ్రీదేవి తర్వాత ఆ లెవెల్ లో కామెడీ చేసిన ఏకైక నటిని నేనే” అని ప్రకటించేసుకుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలిసిందే…. నెటిజన్లంటా ఈమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు.