అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నియంతృత్వ ధోరణి నుండి బయటకు రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం తుళ్లూరు మహాధర్నాలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతో కలిసి హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడుతూ జగన్ పిచ్చి నిర్ణయాలతో రాష్ట్రం అధోగతి పాలవుతోందని వ్యాఖ్యానించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారాలు కుప్పకూలాయనీ, ఎవరి మీదో కక్ష పెట్టుకుని ప్రజలను బజారున పడేస్తున్నారనీ కన్నా విమర్శించారు.
జగన్మోహనరెడ్డి ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రం వైసిపి కార్యాలయమో, జగన్ ఇల్లో కాదని వ్యాఖ్యానించారు. జగన్ ఇష్టానురీతిలో నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. జరగాల్సింది పరిపాలన వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ అని కన్నా పేర్కొన్నారు.
సాక్షాత్తూ ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన రాజధానిని మరో చోటుకు తరలించడం అవివేకమని అన్నారు. ఇది కేవలం అమరావతి రైతుల సమస్య కాదని, రాష్ట్ర సమస్య అని కన్నా స్పష్టం చేశారు.జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడేలా చేస్తోందని ఆరోపించారు. రాజధానిలో నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. రైతులకు అండగా బిజెపి ఉంటుందని కన్నా భరోసా ఇచ్చారు.రాజధాని విషయంలో అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామని చెప్పారు.
ఈ ప్రాంతానికి రాజధాని వస్తుందని మూడు పంటలు పండించే భూములను ప్రభుత్వానికి రైతులు ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం రైతుల త్యాగాలను సీరియస్గా తీసుకోకుండా కాలయాపన చేసిందని విమర్శించారు.అధికారంలోకి వస్తే స్వర్గాన్ని చూపిస్తానన్న జగన్ అధికారంలొకి వచ్చాక కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజదాని మారిస్తే బయట నుంచి ఎవ్వరూ రారనీ, అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు.
కాగా తుళ్లూరు రైతుల మహాధర్నాకు హాజరైన స్వామి శివనందలహరి రాజధాని అమరావతి సాధన కోసం మహా చండీయాగం నిర్వహిస్తామని తెలిపారు.