Kanpur Road Side Vendors: ఒకరు ఛాయ్ అమ్ముకుంటూ జీవనం..మరొకరు తోపుడు బండిపై పండ్ల విక్రయం చేస్తుంటారు. చూడటానికి వారు చిరు వ్యాపారుల్లా కనిపిస్తున్నా వారి ఆదాయం లక్షల్లో, మరి కొందరి ఆదాయం కోట్లలో ఉంటోంది. నమ్మడానికి ఇది కొంచెం కష్టమైనా అక్షర సత్యమే. ఉత్తరప్రదేశ్ లోని కాన్ఫూర్ లో పేదలుగా పరిగణిస్తూ చిరు వ్యాపారాలు చేసే వారిపై ఇటీవల ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు దర్యాప్తు జరిపారు. వారి విచారణ క్రమంలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయిట. ఐటి అధికారుల విచారణలో అక్కడ 250 మందికి పైగా చిరువ్యాపారులు కోటీశ్వరులేనని తేలింది. కానీ వీరు ఎవరూ ఆదాయపన్ను శాఖకు పన్నులు చెల్లించడం లేదు, జీఎస్టీ పరిధిలో లేరు. 256 మంది చిరు వ్యాపారులు లక్షల్లో ఆర్జిస్తూ ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదని అధికారులు గుర్తించారు.
వీరందరికీ కమర్షియల్ ఏరియాల్లో భూములు, షాపులు ఉన్నట్లు గుర్తించారు. కరోనా విపత్కర సమయంలో దేశ వ్యాప్తంగా వేలాది మంది ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనూ ఈ చిరు వ్యాపారులు కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారుల దర్యాప్తులో తేలింది. కొందరైతే ప్రభుత్వ కళ్లు కప్పడానికి వారి బంధువుల పేర్లతో ఆస్తులను కొనుగోలు చేసినట్లుగా కూడా గుర్తించారు. వీరి పాన్ కార్డులు, అథార్ కార్డుల తో ఐ టీ అధికారులు తనిఖీ చేయగా వారి ఆదాయం, ఆస్తుల వివరాలు తెలిసి ఖంగుతిన్నారు. దీంతో వారందరికీ నోటీసులు జారీ చేసే పనిలో నిమగ్నమైయ్యారు ఐ టీ శాఖ అధికారులు.