(న్యూడిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్ గుండె పోటు కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన దక్షిణ ఢిల్లీ ఓఖ్లాలోని ఫ్లొర్టిస్ ఆసుపత్రిలో చేరినట్లు ఎఎన్ఐ వార్త సంస్థ తెలియజేసింది. కపిల్ దేవ్ గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారని తెలియడంతో అభిమానులు, సహచరులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. కపిల్ దేవ్ త్వరగా కోలుకోవాలని ఆయన సహచరులు, క్రికెట్ క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
ప్రపంచ క్రికెట్ లో అగ్రశేణి ఆల్ రౌండర్ లలో కపిల్ దేవ్ ఒకరు. వెస్ట్ ఇండియన్ కోర్నీ వాల్ష్ చేతిలో పరాజయం పాలయ్యే వరకూ కపిల్ దేవ్ అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారు. 131 టెస్టు మ్యాచ్ ల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన కపిల్ 434 వికెట్ లు తీసుకుని 5248 పరుగులు చేశారు. అదే విధంగా 225వన్డే మ్యాచ్ లు అడాడు. 253 వికెట్ లు పడగొట్టి 3783 రన్స్ చేశారు. కపిల్ సారథ్యంలో 1983లో ప్రపంచ కప్ సాధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ నుండి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్ గా కపిల్ దేవ్ రికార్డు సొంతం చేసుకున్నారు. 1999 అక్టోబర్ నుండి 2000 ఆగస్టు వరకూ పది నెలల పాటు భారత జట్టుకు కోచ్ గా వ్యవహరించారు.