చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ కు మాతృవియోగం జరిగింది. ఏఆర్ రహమాన్ తల్లి కరీమా బేగం గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో రహమాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
కరీమా బేగం భర్త ఆర్కే శేఖర్..రెహమాన్ తొమ్మిదేళ్ల వయసులోనే మరణించారు. కరీమా బేగం, శేఖర్ దంపతులకు నలుగురు సంతానం కాగా రెహమాన్ వారిలో చివరి వాడు. కాగా రెహమాన్ తల్లి ఆత్మకు శాంతి కలగాలని పలువురు ప్రముఖులు ప్రార్థించారు.
చిత్ర సీమకు 2020 విషాద సంవత్సరం అయ్యింది. కరోనా మహామ్మారి కోట్ల మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. కళామతల్లి ముద్దుబిడ్డల ప్రాణాలను బలి తీసుకుంది. గాన గందర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి, సీనియర్ నటుడు రావి కొండలరావు, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసూరి వేణుగోపాల్, యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లు ఈ ఏడాది మృతి చెందిన విషయం తెలిసిందే.