Karnam Malleswari: ఏపికి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లేశ్వరి ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితులైయ్యారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్పోర్ట్స్ విశ్వ విద్యాలయానికి కరణం మల్లేశ్వరి మొట్టమొదటి వీసీగా ఉత్తర్వులో పేర్కొన్నది. త్వరలో ఈ నియామకానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తామని పేర్కొంది.
ఏపిలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కరణం మల్లేశ్వరి 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలంపిక్స్ లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించారు. ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకు ముందే 29 అంతర్జాతీయ పతకాలతో రెండు సార్లు వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ గా కరణం మల్లేశ్వరి నిలిచారు. ఇందులో 11 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. క్రీడల్లో ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1999లో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. 1994లో అర్జున అవార్డు, 1995లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు మల్లేశ్వరి.
ఒలింపిక్ క్రీడల్లో దేశానికి కనీసం 50 వరకు గోల్డ్ మెడల్స్ తెచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేసినట్లు ఇటీవల ఢిల్లీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. స్పోర్ట్స్ యూనివర్శిటీలో క్రీడాకారులు ఇకపై ఇక్కడ తాము ఎంచుకున్న క్రీడాంశంలో డిగ్రీ పొందవచ్చని అన్నారు. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీ క్రీడారంగంలో దేశాన్ని గర్వించేలా చేస్తుందన్న నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు.