బెంగళూరు, ఫిబ్రవరి 8: రాష్ట్రంలో జెడిఎస్ – కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను లాక్కుని ప్రభుత్వాన్ని అస్తిరపర్చాలని బిజెపి యత్నిస్తున్నదని దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, బిజెపి కర్నాటక అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప జెడిఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడిన రెండు ఆడియా క్లిప్పింగ్లను గురువారం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కుమారస్వామి విడుదల చేశారు.
జెడిఎస్ ఎమ్మెల్యే నాగన్నగౌడకు మధ్యవర్తుల ద్వారా యెడ్యూరప్ప డబ్బులు ఎర చూపినట్లు ఆడియోలో స్పష్టంగా ఉందని కుమారస్వామి అన్నారు.
ఈ ఆరోపణలను యెడ్యూరప్ప తీవ్రంగా ఖండించారు. ‘కుమారస్వామి విడుదల చేసిన టేపులు పూర్తిగా తప్పు. కుమారస్వామి సినీ నిర్మాత, వాయిస్ రికార్డింగ్ డబ్బింగ్ చేయించడంలో ఆయనకు అనుభవం ఉంది, అవి వారు సృష్టించిన ఆడియో టేపులే’ అని యెడ్యూరప్ప అన్నారు.
తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కుమారస్వామి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని యెడ్యూరప్ప అన్నారు.