తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు. రాజకీయాల్లోకి కొత్త నేతలు ఎంట్రీ ఇస్తున్నారు.
పలు టీవీ షోలల్లో యాంకర్గా వ్యవహరించడంతో పాటుగా తెలుగు బిగ్ బాస్ షోలో భాగస్వామి కూడా అయిన కత్తి కార్తీక రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉండనున్నట్లు కత్తి కార్తీక తెలిపారు.
ఆ ఉప ఎన్నికతో ఎంట్రీ
టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల ఆకస్మికంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఎన్నిక అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో కత్తి కార్తిక ఇండిపెండెంట్గా దుబ్బాక ఉప ఎన్నిక బరిలో దిగేందుకు సన్నద్ధం అవుతున్నారు. 2 రోజులుగా దుబ్బాకలో తిరుగుతూ, వివిధ సంఘాల నాయకులతో సమాలోచనలు చేపడుతున్నారు. యువజన సంఘాలు ఏర్పాటు చేసిన వినాయక మండపాలకు చేరుకుని యువతతో మాట్లాడుతున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో ముచ్చటించారు.
ఉప ఎన్నిక అసలు జరగదా?
ఇటీవల కన్నుమూసిన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సంతాపంగా, ఆయన కుటుంబానికి అండగా ఉండేందుకు ఎన్నిక ఏకగ్రీవం చేయాలనే ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు.రామలింగారెడ్డి కుటుంబాన్ని ఇటీవల పరామర్శించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉప ఎన్నికలో రామలింగారెడ్డి భార్యకే టికెట్ ఇవ్వాలని కోరారు. రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇస్తే.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో తాను మాట్లాడుతానని జగ్గారెడ్డి ప్రకటించేశారు. అయితే, ఈ విషయంలో జగ్గారెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకిచ్చారు. దుబ్బాక బై పోల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దుబ్బాక ఎన్నికలపై ఎవరు ఎన్ని మాట్లాడినా అది వారి వ్యక్తిగతమన్న ఉత్తమ్… మండలాల వారిగా సమావేశాలు పెట్టాలని డీసీసీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అవాక్కవడం జగ్గారెడ్డి వంతు అయింది. అదే సమయంలో కాంగ్రెస్ వైఖరి స్పష్టం కావడంతో పలువురు నేతలు పోటీ చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇదే సమయంలో బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తిక ఎంట్రీ ఇచ్చి తాను సైతం బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.