ఆర్థికంగా ఉన్నవాళ్ల గురించి కాకుండా పేద మధ్య తరగతి వారి గురించి ఆలోచిస్తేనే అందరికీ మేలు కదా.
ఇప్పుడు చర్చించుకోబోయేది అలాంటి విషయమే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కే చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవ తీసుకొని కీలకమైన అంశానికి ఫుల్ స్టాఫ్ పెట్టకపోవడం వల్ల.. రెండు రాష్ట్రాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అంటున్నారు. ఇదంతా తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల గురించి.
కరోనా కష్టకాలం నుంచి…
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం వల్ల తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్ సడలింపు అనంతరం నేపథ్యంలో బస్సు సర్వీసులు నడుస్తాయని పలువురు భావించారు. అయితే, దీనికి మోక్షం దక్కలేదు. చర్చల అనంతరమే బస్సులు నడపాలనే విషయం తెరమీదకు వచ్చింది. కానీ గత కొద్దిరోజులుగా పెండింగ్లో ఉండిపోయింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రుల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని క్లియర్ చేస్తాయని భావించినా ఎందుకో ఈ విషయం వెనక్కు వెనక్కు వెళ్తూనే ఉంది. అయితే, ఏపీ తెలంగాణా బస్సుల గురించి ఏపీ ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం వల్లే…
తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల విషయంలో తెలంగాణ అంశాన్ని ప్రధానంగా కృష్ణబాబు ప్రస్తావించారు. తెలంగాణా ఏపీని బస్సులు తగ్గించుకోమని సూచిస్తోందని, తెలంగాణ సూచనల మేరకు సర్వీసులను తగ్గించుకోవవడానికి సిద్దంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బస్ సర్వీసులను పెంచడానికి ఇష్టపడడం లేదని పేర్కొన్నారు. ఏపీ తగ్గించుకునే 1.10 లక్షల కిలోమీటర్ల మేర రవాణను ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు.
విజయవాడ హైదరాబాద్ మధ్యే…
ఏపీ 72 రూట్లల్లో బస్సులు తిప్పుతుంటే.. తెలంగాణ 27 రూట్లల్లో మాత్రమే బస్సులు నడుపుతోందని కృష్ణబాబు అన్నారు. ఏపీ తిప్పే సర్వీసుల కంటే రెట్టింపు సర్వీసులు తిప్పుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ-హైదరాబాద్ రూట్లో మాత్రమే డబుల్ సర్వీసులు తిప్పుతామని తెలంగాణ ప్రభుత్వం చెప్తోందని మిగిలిన రూట్ల గురించి ప్రస్తావించడం లేదని ఆయన అన్నారు.
అంటే ఆవేదనేనా?
ఏపీ – తెలంగాణ మధ్య బస్సులు మొదలవడం గురించి అనేకమంది ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు బస్ ఆపరేటర్ లు బస్సులు నడుపుతుండడం కొంత మేర ఇబ్బంది లేకుండా చేస్తోంది. అయితే, తెలుగు రాష్ట్రాల సర్వీసుల విషయంలో ప్రజలు ఎదురుచూపులకు చెక్ పెట్టేలా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.