(హైదరాబాదు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
హైదరాబాద్ నగరంలో వరద ప్రవాహానికి గురైన ప్రతి ఇంటికి రూ.10వేల వంతున సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పారు. వరద ముంపు బాధిత కుటుంబాలకు సోమవారం కేసిఆర్ సాయం ప్రకటించారు. ఆర్థిక సహాయం పంపిణీ రేపటి (మంగళవారం) నుండే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలు తీవ్ర కష్టాలకు, నష్టాలకు గురి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు కేసిఆర్. వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.
ఇల్లు పూర్తిగా కోల్పోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేల వంతున సాయం అందించనున్నట్లు చెప్పారు. దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయిస్తామన్నారు. ఎంత వీలైతే అంత త్వరగా నగరంలో సాధారణ నెలకొనే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కేసిఆర్. నగరంలో పేదలకు వరద సాయం అందించేందుకు మున్సిపల్ శాఖకు రూ.550 కోట్లు కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
దాదాపు వందేళ్లలో ఎప్పుడూ లేనంత భారీ వర్షం ఇప్పుడు నమోదు అయ్యిందనీ, బస్తీలు, లోతట్టు ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు కేసిఆర్. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు ముందుకు రావాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో టీఆర్ఎస్ శ్రేణులు సహాయ చర్యల్లో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.