KCR: ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనను ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం చూస్తూనే ఉన్నాము. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం, కోర్టులను ఆశ్రయించి స్టేలు తీసుకురావడం జరుగుతోంది. జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై ఇక్కడ విమర్శలు వస్తుంటే పొరుగు రాష్ట్రాల నేతలకు ఈ పథకాలు స్పూర్తిగా నిలుస్తున్నాయి. ఏపిలో అమలు చేస్తున్న సచివాలయ వ్యవస్థపై ఇంతకు ముందు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పరిశీలించి వెళ్లారు. ఏపిలో అమలు చేసిన రేషన్ డోర్ డెలివరీ సిస్టమ్ ను కూడా ఇతర రాష్ట్రాలు అమలు కోసం అధ్యయనం చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ సర్కార్ కూడా కొన్ని విషయాల్లో ఏపిని ఆదర్శంగా తీసుకున్నట్లు కనబడుతోంది.
కేసిఆర్ సర్కార్ మూడు కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ భేటీలో విద్యా వ్యవస్థకు సంబంధించి మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మూడు నిర్ణయాలు కూడా ఇప్పటికే ఏపిలో జగన్ సర్కార్ అమలు చేస్తున్నవే కావడం గమనార్హం. కేసిఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఏమిటంటే…1. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యాబోధన, 2. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చర్యలు, 3. పాఠశాలల రూపు రేఖలు మార్చడం. ఏపిలో జగన్మోహనరెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత పాఠశాలల్లో రూపు రేఖలు మార్చేందుకు గానూ నాడు – నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.
ఏపిలో జగన్ అమలు చేస్తున్నవే..
ఈ అంశంలో ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుండి ఎటువంటి ఇబ్బంది రాలేదు కానీ ఇంగ్లీషు మీడియం ఏర్పాటు, ఫీజుల నియంత్రణల చర్యల విషయంలో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. వీటిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వానికి హక్కు లేదంటూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చింది. దీనిని ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఇంగ్లీషు మీడియం విద్యా బోధనకు ప్రజల నుండి సానుకూలత వ్యక్తం అయ్యింది. మరో పక్క ప్రభుత్వ సంస్కరణల వల్ల పాఠశాలల్లో విద్యార్ధుల చేరిక సంఖ్య గణనీయంగా పెరిగింది. సో.. ఏపిలో జగన్మోహనరెడ్డి సర్కార్ అమలు చేసిన ఈ పథకాలను కేసిఆర్ స్పూర్తిగా తీసుకున్నారని నెటిజన్ లు కామెంట్స్ చేస్తున్నారు.