తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల నుండి మరియు ప్రతిపక్ష నాయకుల నుండి కరోనా నియంత్రణ విషయంలో విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా గతంలోనే పలుమార్లు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆయన ప్రభుత్వాన్ని… తగిన స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదని చివాట్లు పెట్టింది. వెంటనే తమ తీరు మార్చుకోవాలని తీవ్రమైన ఆదేశాలు కూడా జారీ చేసింది.
అయితే ఒక మోస్తరుగా తెలంగాణలో టెస్టుల సంఖ్యను పెంపొందించారు కానీ రోజు నమోదవుతున్న కేసులకు మరియు జరుగుతున్న టెస్టులకు అసలు పొంతన లేకుండా పోయింది. అంతేకాకుండా గత వారం చివరలో రెండు రోజులు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కెసిఆర్ ప్రభుత్వం కరోనా టెస్టులను రాష్ట్రంలో చేయకుండా నిలిపివేయవలసి వచ్చింది. ఇదేమిటి అని ప్రశ్నిస్తే శాంపిల్స్ ఎక్కువ అయిపోయాయని మరియు ఉన్న వాటిని పరీక్షించి రిజల్ట్ ఇచ్చేందుకే ల్యాబ్ సిబ్బంది తక్కువగా ఉన్నారని చెప్పారు.
దీంతో నిన్ననే హైకోర్టు మళ్లీ ప్రభుత్వం పని తీరుని తప్పు బట్టి వీలైనంత త్వరగా టెస్టులో సంఖ్య పెంచాలని ఇతర రాష్ట్రాల్లో రోజుకి 20,000 టెస్టులు జరుగుతుంటే…తెలంగాణలో కేవలం సగటున మూడు నుండి ఐదు వేల టెస్టులు మాత్రమే చేస్తున్నారని గుర్తు చేసింది. వారి తీరు మారకపోతే ఈ నెల ఆఖరున సంబంధిత అధికారులు మరియు సీనికి బాధ్యులైన వారందరూ వచ్చి ఒక కోర్టు ముందు హాజరు కావాలని కూడా కటువుగా చెప్పింది. టెస్టులు చేయకపోతే వ్యాధి తీవ్రత ఎలా తెలుస్తుంది అని ప్రభుత్వానికి ఎదురు ప్రశ్నలు వేసింది.
అయితే కోర్టు వారి ఆదేశాల ప్రకారం మళ్ళీ రాష్ట్రంలో టెస్టులను చేపట్టడమే కాకుండా వాటి సంఖ్య భారీగా పెంచాల్సిన బాధ్యత ఉన్న కేసీఆర్ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో నాలుగు రోజులు రాష్ట్రంలో కరోనా టెస్టులు నిర్వహించబోమని స్పష్టం చేసింది. దీనికి గల కారణం మీడియా వారికి ఇంకా చెప్పకపోగా ప్రస్తుతానికైతే ప్రైవేట్ ల్యాబ్స్ అన్నింటిని టెస్టులు ఆపివేయమని సూచించింది.
ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రైవేట్ ల్యాబ్ ల పనితీరుపై మరియు రాష్ట్రంలో అనేక టెస్టుల రిజల్ట్స్ పై అనేక అభియోగాలు వచ్చాయి. ఈరోజు నెగిటివ్ అని రిజల్ట్ వచ్చిన వ్యక్తికి మరో రెండు రోజులకి పాజిటివ్ అని వేరే చోట తేలుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికే హైకోర్టుకు ప్రభుత్వం పై తీవ్ర అసహనం తో ఉన్న సమయంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా సాహసమనే చెప్పాలి.