ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్.. వీరిద్దరి పనితీరు దూకుడుగానే ఉంటుంది. అందుకే వీరిద్దరి పాలనలో సారూప్యం కనిపిస్తూ ఉంటుంది. కేసీఆర్ పనితీరును జగన్ ఫాలో అవుతున్నారా.. జగన్ పనితీరును కేసీఆర్ ఫాలో అవుతున్నారా అన్నట్టు కొన్ని నిర్ణయాలు కనిపిస్తూంటాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వం ఆరు నెలల కిందటే తీసుకుంది. ఏపీలో ఇంకా ఫలితాలివ్వని ఆ నిర్ణయం.. తెలంగాణలో తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
పరిశ్రమల్లో ఉద్యోగాలు స్థానికులకేనట..
ఇకపై పరిశ్రమల్లో ఉద్యోగాలు 75 శాతం స్థానికులకే అని ఏపీ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఇది ఆచరణలో సాధ్యమయ్యేది కాదని.. సాంకేతిక ఇబ్బందులుంటాయని వివరణతో సహా ఉన్నతాధికారులు సీఎం జగన్ కు వివరించారు. కానీ.. జగన్ దీనిపై ముందుకే వెళ్లారు. ఈ విషయంలోనే గత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సీఎం జగన్ కు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. స్థానిక పరిశ్రమల్లో పని చేయటానికి స్థానికులు ఆసక్తి చూపరు. యాజమాన్యం ఇచ్చే వేతనానికి వారు ససేమిరా అంటారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని గ్రానైట్ పరిశ్రమలో దాదాపు 15వేల మంది కార్మికుల్లో ఎక్కవగా బీహార్, యూపీ, రాజస్థాన్ నుంచి వచ్చిన వారే ఉంటారు. వీరికి రోజుకి 300 నుంచి 400 వేతనం ఇస్తూంటారు. అదే స్థానికులైతే రోజుకి 700 వరకూ డిమాండ్ చేస్తారు. దీంతో యాజమాన్యం పొరుగు రాష్ట్ర కార్మికులకే ప్రాధాన్యం ఇస్తుంది.
సీఎం కేసీఆర్ ఇదే నిర్ణయం..
కొత్త పరిశ్రమల్లో ఇకపై స్థానికులకే 50 శాతం ఉద్యోగాలంటూ తెలంగాణ క్యాబినెట్లో తీర్మానించారు. ఏపీలో ఆచరణలో సాధ్యంకానీ ఈ నిర్ణయం తెలంగాణలో ఏమేరకు సక్సెస్ అవుతుందో.. పరిశ్రమలు ఎలా స్పందిస్తాయో చూడాలి. కాకపోతే.. ఏపీలో 75శాతం అయితే.. తెలంగాణలో 50శాతం మాత్రమే ఇవ్వడం కాస్తంత ఉపశమనం అని చెప్పాలి.