గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణకు సిద్ధపడడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తెగువ చూపారు.
ఈ నెల మూడో తేదీన జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రావడం,హైదరాబాద్ మహానగరంలో కూడా ఇటీవలి వర్షాలు వరదల కారణంగా ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపధ్యంలో ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను వాయిదా వేస్తారని ఊహాగానాలు సాగాయి.సాధారణంగా అన్ని పరిస్థితులు అనుకూలించిన సమయంలోనే అధికార పార్టీ ఎన్నికలకు వెళుతుంది.నిజానికి ఇప్పుడు హైదరాబాదులో టీఆర్ఎస్ కి ప్రతికూల గాలి వీస్తున్న సంకేతాలు వస్తున్నాయి.హైద్రాబాద్ లోని అనేక ప్రాంతాలు వరదల తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి.చెప్పలేనంతగా ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు.సహాయక చర్యల కోసం వెళ్లిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ప్రజాగ్రహం పెల్లుబికింది.వారిని ప్రజలు తరిమి తరిమి కొట్టిన సంఘటనలు కూడా జరిగాయి.
రేపు టిఆర్ఎస్ కి ఓట్లు వేయాల్సింది కూడా ప్రజలే!కానీ వారు అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సాహసించటం విశేషం.తద్వారా ఆయన ‘వీడు మగాడ్రా బుజ్జి’అనిపించుకున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.అయితే ఇందులోనూ కెసిఆర్ రాజకీయ చతురత ఉందంటున్నారు.ఇప్పుడు కాకుండా కొద్దిగా వ్యవధిఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తే ఆనాటికి బిజెపి ఇతర ప్రతిపక్ష పార్టీలు హైద్రాబాద్లో నా బలం పుంజుకునే అవకాశం ఉంటుందని అంచనా వేసిన కేసీఆర్ అలాంటి ఛాన్స్ వారికి ఇవ్వకుండా నేరుగా ఎన్నికలకు వెళ్లిపోయాడని చెబుతున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు ఎంత పోటీ ఇచ్చినప్పటికీ మేయర్ స్థానం టీఆర్ఎస్కే దక్కుతుండగా ఆయన లెక్కట.
ఐదేళ్ల క్రితం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తొంభై తొమ్మిది డివిజన్లు లభించాయి.ఈసారి వంద పక్కా అంటూ కేటీఆర్ చెబుతూ వచ్చారు.ఒకవేళ ఎంత ఘోరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ మెజార్టీ మార్క్ డెబ్బై ఆరు ను టచ్ చేయడానికి ఇప్పుడైతే టిఆర్ఎస్ కి అవకాశముందన్నది గులాబీ నేతల విశ్లేషణ.ఈ ఎన్నికలను వాయిదా వేసి రెండు మూడు నెలల తర్వాత నిర్వహిస్తే ఆలోపు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవ్వడం, అప్పటికీ ప్రజలకు సంతృప్తి కలగకుంటే టీఆర్ఎస్ ఘోరపరాజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని లెక్క కట్టిన కేసీఆర్ కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నగారా మోగించేశారట.గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కూడా కేసీఆర్ ఎనిమిది నెలల ముందే నిర్వహించటం ఇక్కడ గమనార్హం.ప్రతిపక్షాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా పద్మవ్యూహం నిర్మించటం కేసీఆర్ వ్యూహం.మళ్లీ అదే పంథాను కేసీఆర్ మరోసారి అవలంబిస్తున్నారు.