తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భిన్నమైన రాజకీయ వేత్త అనే సంగతి తెలిసిందే. పరిపాలనలో కూడా అనేక విప్లవాత్మక నిర్ణయాలకు ఆయన పెట్టింది పేరు.
ఎవరేం అనుకున్నా…తను అనుకున్నది చేసుకుంటూ పోయే తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణయం ఏకకాలంలో హైదరబాద్లో ఉన్న జనాలకు గుడ్ న్యూస్ కాగా, ఏపీ ప్రజలకు మాత్రం షాక్ వంటిదని అంటున్నారు. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో 25 శాతం బస్సులను మాత్రమే నడపనుంది.
ఎట్టకేలకు కేసీఆర్ తీపికబురు
కరోనా వైరస్, లాక్డౌన్ కారణాల వల్ల హైదరాబాద్ సిటీలో ఆర్టీసీ బస్సులు మూతపడ్డాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. జిల్లాల్లో కేసుల సంఖ్య కొంత మేర తగ్గడం, ప్రజా రవాణకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడంతో రాజధాని నుంచి జిల్లా సర్వీసులను ప్రభుత్వం గతంలో ప్రారంభించింది. అయితే గ్రేటర్లో కరోనా విజృంభణ అదుపులోకి రాకపోవడం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేపోయింది. అయితే, అన్ లాక్ లో భాగంగా ప్రజా రవాణాకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రాల మధ్య, జిల్లాల మధ్య బస్సులు పరుగులు తీస్తున్నాయి. నగరంలో సిటీ బస్సులపై మొన్నటి వరకు సందిగ్దత నెలకొంది. సిటీ సర్వీసులను తిరిగి ప్రారంభిస్తే కేసులు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే, సిటీ శివారు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా బస్సులను నడుపుతున్నారు.
కేసీఆర్ చెప్పడంతో మాట మారింది
మొదట సిటీ బస్సులను 50 శాతం నడపనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ సీఎం ఆదేశాలతో ప్రస్తుతం 25 శాతం మాత్రమే బస్సులు నడపనున్నట్లు రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే సిటీ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బస్సులు నడవకపోవడంతో ప్రజలు సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది. సిటీ బస్సులు అందుబాటులోకి వస్తే సామాన్యప్రజల కష్టాలు కొంత మేర తగ్గుతాయని చెప్పొచ్చు.
ఏపీ ప్రజలకు నిరాశేనా?
కరోనా కారణంగా మార్చి 22 వ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగడం లేదు. దాదాపుగా ఆరునెలల పాటు బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అంతరాష్ట్ర బస్సు సర్వీసుల విషయానికి వస్తే, కేవలం కర్నాటక, మహారాష్ట్రకు మాత్రమే నడిపించేందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు. అయితే, ఏపీ ప్రజలు ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది.