దేశవ్యాప్తంగా ఇప్పుడు డ్రగ్స్ దందాపై సంచలన చర్చ జరుగుతోంది. సినీ నటుడు సుశాంత్ ఆత్మహత్యతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ కేసులో తీగ లాగతే డొంక కదులుతోంది.
సుశాంత్తో కలిసి డ్రగ్స్ వినియోగం ఆరోపణలతో అరెస్టయిన ఆయన మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి పర్వం సంచలనంగా మారింది. అనంతరం ఇందులో పలువురు సెలబ్రిటీల పాత్ర సైతం అదే రీతిలో హాట్ టాపిక్ అయింది. అయితే, ఈ అంశంలో తాజాగా తెలంగాణకు చెందిన సీనియర్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్లో ఏం జరిగిందంటే…
రిటైర్డ్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ హైదరాబాద్లో జరిగిన ఓ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు గ్లామర్ వరల్డ్ లోనే అధికంగా డ్రగ్స్ వినియోగం జరిగేదని అయితే, ఇప్పుడు అది అన్ని రంగాలకు పాకిందన్నారు. ఒత్తిడి, అందం, స్టేటస్ సింబల్ అనే భ్రమలో మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారని విశ్లేషించారు. తీగలాగితే డొంక కదులుతుందనే ఉద్దేశంతోనే తాము వినియోగదారులను విచారించామని, టాలివుడ్ లో దోషులకు పట్టుకునే వరకు విచారణ చేశామని చంద్రవదన్ వెల్లడించారు. అయితే, తమపై అధికార, రాజకీయ, ప్రముఖుల వత్తిడి వల్ల దర్యాప్తును పూర్తి చేయలేకపోయామని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరు ఒత్తిడి చేశారో, ఏలాంటి ఒత్తిడులకు లోనయ్యామో రిటైర్ అయ్యాక చెప్పడం సబబు కాదని రిటైర్డ్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే డ్రగ్ సమస్య మరోసారి తతెత్తేది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కఠినంగా వ్యవహరిస్తే ఇప్పుడు ఇలా జరిగేది కాదని పేర్కొన్నారు. డ్రగ్స్ దేశానికి పీడలా మారిందని పేర్కొన్న ఆయన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా దోషులను శిక్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రగ్స్ వినియోగాన్ని అనైతిక చర్యగా కాకుండా అనారోగ్య చర్య అనే కోణంలో పరిశీలిస్తే సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చునని రిటైర్డ్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ విశ్లేషించారు.
అందుకే డ్రగ్స్ తెరపైకి…
సామాజిక కార్యకర్త దేవి ఇదే సమావేశంలో మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు, ప్రభుత్వాలు సంక్షోభం నుంచి బయట పడేందుకే డ్రగ్స్ ను తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. ప్రభుత్వాలను చిత్తశుద్ది ఉంటే టాలివుడ్ లో డ్రగ్ దోషులను ఎందుకు పట్టుకోలేకపోయారని పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె టార్గెట్ చేశారు. డ్రగ్స్ తో సినీ ఇండస్ట్రీలోని వాకె చనిపోయినా సామాన్యులకు నష్టం లేదని ఆమె అన్నారు. నిరుద్యోగం, వలస కార్మికులు, రైతు ఆత్మహత్యలు, గృహ హింస, లాక్ డౌన్ సమస్యలపై చర్చ జరగొద్దనే డ్రగ్స్ పై మీడియాను ఎంగేజ్ చేస్తున్నారని ఆరోపించారు.
అక్కడ మొదలైన లింక్….
సుశాంత్ రాజ్పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ కేసును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)లోతుగా విచారిస్తోంది. ముంబై డ్రగ్స్ కేసులో ఎన్సీబీ దూకుడు పెంచింది. రియా చక్రవర్తితో పాటు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ జయా సాహాను విచారించిన ఎన్సీబీ… వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులో దీపిక పదుకొణె, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లకు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి మూడు రోజుల్లో తమ ముందుకు హాజరుకావాలని ఎన్సీబీ ఆదేశించింది.
ఈ కేసులో నిన్న దీపిక పదుకొణె, కరిష్మా ప్రకాశ్ను ప్రశ్నించిన ఎన్సీబీ.. రియా ఫోన్ చాటింగ్ ఆధారంగా వీరికి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీపికతో పాటు శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్లకు సైతం ఎన్సీబీ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది.
రియా చక్రవర్తి బాధ ఏంటంటే…
ఇదిలాఉండగా, సుశాంత్ ఆత్మహత్య కేసుతో పాటు డ్రగ్స్ వినియోగం ఆరోపణలతో అరెస్టయిన రియా చక్రవర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుకు సంబంధించిన డ్రగ్స్ ఆరోపణలపై రియా చక్రవర్తిని సెప్టెంబర్ 9 న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమె జ్యుడిషియల్ కస్టడీ నిన్నటితో ముగియగా.. న్యాయస్థానం అక్టోబర్ 6 వరకు పొడిగించింది. అయితే, బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో సుశాంత్ గురించి నమ్మలేని విషయాలు వెల్లడించింది. సుశాంత్ తరుచూ డ్రగ్స్ తీసుకునేవాడని.. డ్రగ్స్ తీసుకురావాలంటూ సిబ్బందిని కోరేవాడని పేర్కొంది. సుశాంత్ జీవించి ఉంటే అతడిపై తక్కువ అభియోగాలు నమోదయ్యేవని, ఏడాది మాత్రమే జైలుశిక్ష విధించేవారని తెలిపింది. డ్రగ్స్ కోసం తనను, తన సోదరుడితో పాటు ఇతరులను సుశాంత్ వాడుకున్నాడని రియా ఆరోపించింది. ‘సుశాంత్ డ్రగ్స్ కోసం నాతో క్లోజ్గా ఉండేవాడు. నా సోదరుడిని, సిబ్బంది డ్రగ్స్ కోసం వేధించేవాడు. అతడు చేసిన దానికి ఇప్పుడు మేం ఫలితం అనుభవిస్తున్నాం’ అని రియా విచారణలో ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.