తెలంగాణలో గిరిజనులకు ఇచ్చిన హామీని సీఎం కేసిఆర్ నిలబెట్టుకున్నారు. ఇటీవల బంజారా భవన్ ప్రారంభోత్సవ సభలో సీఎం కేసిఆర్ .. గిరిజనులకు ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ లను పది శాతం పెంచుతానని వాగ్దానం చేశారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి జివో నెం.33 ను విడుదల చేసింది కేసిఆర్ సర్కార్. చెల్లప్ప కమిషన్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయనీ, విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు ఈ రిజర్వేషన్ లు అమలు అవుతాయని ఉత్తర్వులో పేర్కొంది.
గిరిజన రిజర్వేషన్ లకు సంబంధించి కేసిఆర్ సర్కార్ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కొరకు కేంద్రానికి పంపింది. అయితే దీనిపై కేంద్రం ఇంత వరకూ దానిపై నిర్ణయం తీసుకోలేదు. దీంతో మోడీ సర్కార్ పై సీఎం కేసిఆర్ .. బంజారా భవన్ ప్రారంభోత్సవ సభలో తీవ్రంగా ఫైర్ అయ్యారు. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా తాను రిజర్వేషన్లు పెంపుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్య, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు 64 శాతానికి చేరాయి. ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసిలకు 29 (ఏ గ్రూపు 7, బీ – 10, సీ -1, డీ – 7, ఇ – 4), ఈడబ్ల్యుఎస్ కు 10 శాతం రిజర్వేషన్లు వస్తాయి.
గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జీవో విడుదల అయిన వెంటనే సంబరాలు మొదలైయ్యాయి. బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో గిరిజన సంఘ నాయకులు, ఆదివాసీలు బాణాసంచా కాలుస్తూ, నృత్యాలు చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. సీఎం కేసిఆర్ కు ధన్యావాదాలు తెలియజేశారు.
తెలంగాణ సీఎం కేసిఆర్ సంచలన ప్రకటన .. గిరిజనులకు గుడ్ న్యూస్