KCR : ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు ప్రజలను నేరుగా కలిసేవారు. వారి సమస్యలను విని వినతిపత్రాలు తీసుకునే వారు.
సాధ్యమయ్యే పనులు పూర్తి చేసి, వారికి సమాచారం ఇచ్చేవారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సాధారణ ప్రజలు సీఎంను కలిసే చాన్స్ లేకుండా పోయింది. ప్రగతిభవన్ లోకి సీఎం షిఫ్ట్ అయ్యాక.. అందులోకి వెళ్లడం లీడర్లకే ఒక కలగా మారింది. సాధారణ ప్రజల పరిస్థితి అయితే.. బయట్నించి చూడటం తప్ప లోపలికి వెళ్లి సీఎంను కలిసి తమ సమస్యలను వివరించే చాన్స్ లేదు. ప్రగతిభవన్ చుట్టూ అనుక్షణం నిఘా వర్గాల కదలికలతోపాటు, సీసీ కెమెరాల్లో భద్రత పర్యవేక్షణ ఉంటుంది. ఏడాదిన్నరగా తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లోకి కూడా ప్రగతిభవన్ తరహాలోనే విజిటర్స్ ను రానివ్వడం లేదు. చుట్టూ మఫ్టీలో పోలీసులు డ్యూటీ చేస్తున్నారు. దాదాపు 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి కదలికలను గమనిస్తున్నారు
KCR : ఇంతకుముందు అలా ..ఇప్పుడిలా
రోజూ వివిధ పనుల కోసం ఆఫీసర్లను కలిసేందుకు సెక్రటేరియట్ కు దాదాపు 500 మంది దాకా జనం వస్తుంటారు. ప్రధానంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం ఎక్కువగా వస్తుంటారు. సెక్రటేరియట్ బిల్డింగ్ షిఫ్టింగ్ కంటే ముందు వరకు మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5 గంటల దాకా విజిటింగ్ అవర్స్ ఉండేవి. విజిటర్స్ నుంచి ఆధార్ నంబర్ తీసుకుని లోపలికి అనుమతిచ్చేవారు. ఆయా శాఖల సెక్రటరీలను విజిటర్స్ కలిసి తమ సమస్యలు చెప్పి, వినతి పత్రాలు అందజేసేవారు. సెక్రటరీలు కూడా విజిటింగ్ అవర్స్ లో అందుబాటులో ఉండేవారు. కానీ కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం 2019 అక్టోబర్లో సెక్రటేరియట్లోని మెజార్టీ శాఖలను పక్కనే ఉన్న బీఆర్కే భవన్లోకి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి విజిటింగ్ అవర్స్ ఎత్తేశారు. షిఫ్టింగ్ పూర్తయ్యే వరకు విజిటింగ్ అవర్స్ లేవని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. కానీ షిఫ్టింగ్ పూర్తయి ఏడాదిన్నర అవుతున్నా బీఆర్కే భవన్లోకి మాత్రం విజిటర్స్ ను రానివ్వడం లేదు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విజిటింగ్ అవర్స్ ను ఎత్తేసినట్లు ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు.
KCR : ఎంట్రీ కి కూడా పరపతి కావాలి!
సెక్రటేరియట్ లోకి వెళ్లాలంటే అంత ఈజీ కాదు. లోపల పనిచేసే ఆఫీసర్లు తెలిసి ఉండాలి. వారు ఎస్పీఎఫ్ పోలీసులకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తిని పంపండని చెప్తేనే అనుమతి ఇస్తారు. కొన్ని సార్లు రాతపూర్వకంగా రాసి ఇస్తేనే పంపుతున్నారు. లేకపోతే ఎంత వేడుకున్నా లోపలికి రానివ్వడం లేదు. అత్యవసర పని ఉందని చెప్పినా వినడం లేదు. ‘‘పై నుంచి ఎవరైనా ఆఫీసర్లు ఫోన్ చేసి చెప్తేనే లోపలికి పంపిస్తాం. అట్ల కాదని ఎవరినైనా పంపితే మాపై యాక్షన్ ఉంటుంది’’ అని ఎస్పీఎఫ్ పోలీసులు అంటున్నారు.
ప్రజల తిప్పలు ఎవరికెలా చెప్పుకోవాలి?
తమ సమస్యల పరిష్కారం కోసం ప్రగతిభవన్ కు వెళ్లి సీఎంను కలిసేందుకు ప్రజలకు అనుమతి లేదు. మినిస్టర్లను కలిసి గోడు వెళ్లబోసుకుందామంటే వారు ఎక్కడ ఉంటారో తెలియదు. ఒక వేళ కలిసినా వెంటనే పని కావడం లేదు. వినతి పత్రాలు తీసుకొని పని చేస్తామని వెనక్కి పంపుతున్నారు. మళ్లీ కలిసి పని కాలేదని గుర్తు చేస్తే.. సెక్రటేరియట్ కు వెళ్లండని మంత్రులు చెప్తున్నట్లు బాధితులు అంటున్నారు. దీంతో సెక్రటేరియట్ కు వెళ్తే.. అక్కడ లోపలికి అనుమతించడం లేదు. జిల్లా కలెక్టర్ స్థాయిలో పరిష్కారం కాని పనులు సెక్రటరీలతో అవుతాయన్న నమ్మకంతో బాధితులు సెక్రటేరియట్ కు వస్తుంటారు. ఎంతో ఆశతో వస్తున్న తమను లోపలికి పంపడం లేదని, ఆఫీసర్లను కలువనివ్వడం లేదని విజిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లయితే తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని గోడు వెళ్లబోసుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?