KCR : తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యే పరిణామం ఇది. అత్యంత ఉత్కంటను రేకెత్తించిన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంకా ట్విస్టుల పరంపర కొనసాగుతోంది. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం , తీన్మార్ మల్లన్న ఈ ఉత్కంఠకు కారణం కాగా ఆ పరిణామాల పరంపర ఇంకా సాగుతోంది.
KCR అభిమానుల ఆత్మహత్యలు…
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తాజా ఎన్నికల్లో ఓటమి చెందడంతో మనస్తాపానికి గురైన రాజు అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన కలకలంగా మారింది. మహబూబాబాద్ జిల్లా సాధు తండాకు చెందిన గుగులోత్ రాజు బీటెక్ పూర్తి చేశాడు. తెలంగాణ భావజాలం ఎక్కువ. టీజేఎస్ విధానాలకు ఆకర్షితుడు అయ్యారు. తాజా ఎన్నికల్లో కోదండరాం ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. మధ్యాహ్నం నుండి మిత్రులకు కోదండరాం సార్ ను గెలిపించుకోలేక పోయాం,అన్నం కూడా తిన బుద్ధి కావడం లేదు అంటూ సదరు యువకుడు మెసేజ్లు పెట్టారని సమాచారం. అనంతరం సాయంత్రం సమయంలో మహబూబాబాద్ లోని బస్టాండ్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా దీనిని గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు డోలి సత్యనారాయణ తదితరులు అక్కడకు చేరుకుని ఆ యువకుడికి ధైర్యం కల్పించి స్నానం చేయించి బట్టలు మార్పించారు.
మల్లన్న అభిమాని మరణం…
తాజా ఎన్నికల్లో చివరి వరకు పోరాడినప్పటికీ తీన్మార్ మల్లన్నకు ఓటమి తప్పలేదు. అయితే.. మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లంకలపల్లి గ్రామానికి చెందిన ఏర్పుల శ్రీశైలం ఆదివారం ఉదయం పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు. ఇక ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి శ్రీశైలం మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. శ్రీశైలం ఆత్మహత్య విషయం తెలుసుకున్న తీన్మార్ మల్లన్న విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని మల్లన్న విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ఇద్దరు నేతల అభిమానులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కలకలం రేకెత్తిస్తోంది.