తెలంగాణలో ఓ వైపు దుబ్బాక ఎన్నికల్లో ఫలితం అన్ని వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుండగా మరోవైపు ఇంకో ఎన్నికల సందడి తెరమీదకు వస్తోంది. వివిధ రాజకీయ పార్టీలకు, ముఖ్య నేతలకు గ్రేటర్ టెన్షన్ పట్టుకుంది.
ఇలాంటి తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు కీలక ఆదేశాలు వెలువరించారు. వరుసగా జరిగిన రెండు సమావేశాల్లో ఆయన ముఖ్య నేతలకు కీలక సూచనలు చేశారు. పార్టీ నేతలతో సమావేశం, అనంతరం తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఆయన ఇదే మాట చెప్పడం గమనార్హం.
కేసీఆర్ సీరియస్
దుబ్బాక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా, గురువారం ప్రగతిభవన్ లోని తన ఇంట్లో మంత్రులు, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత మొదలైన సమావేశం దాదాపు 9 గంటల పాటు కొనసాగింది. దుబ్బాకలో ఊహించని తీరుగా బీజేపీ విజయం సాధించిందని భేటీలో కేసీఆర్ అన్నట్టు తెలిసింది. ‘‘దుబ్బాకలో బీజేపీ గెలవడాన్ని అనేక కారణాలు ఉన్నయ్. భవిష్యత్ లో వాటిని వివరిస్తా. సీఎం సొంత జిల్లాలో పార్టీ ఓడిపోవడం వల్ల పార్టీకి నష్టం అనే ప్రచారాన్ని నమ్మొద్దు. పార్టీ కేడర్లో ఉత్సాహం నింపేలా కార్యక్రమాలు ఉంటయ్” అని కేసీఆర్ అన్నట్లు సమాచారం.
కేబినెట్లో కూడా …
అనంతరం శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం జరిగింది. బీజేపీ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని, అలాంటి చాన్స్ ఇవ్వొద్దని సూచించారు. దుబ్బాకలో ఊహించని రీతిలో బీజేపీ గెలిచిందని, రూరల్ ఏరియాల్లోనూ బలపడుతోందని ఆయన అన్నట్టు తెలిసింది. రూరల్ ఏరియా అయిన దుబ్బాకలో బీజేపీ గెలువడాన్ని ఆషామాషీగా తీసుకొవద్దని లీడర్లకు కేసీఆర్ సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 డివిజన్లు గెలుచుకునేలా ముందుకు వెళ్లాలన్నారు. ఇందుకోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా దుబ్బాక ఫలితం రిపీట్ అయ్యే అవకాశం ఉన్నందున.. ఈ క్యాబినెట్ మీటింగులో ఈ అంశంపై కూడా సమీక్షించనున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?