తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొత్త టార్గెట్ పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా-రైతు-కార్మిక వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్త పోరుకు టిఆర్ఎస్ చొరవ తీసుకుని, సిద్ధమవుతున్నదని ముఖ్యమంత్రి ప్రకటించారు. డిసెంబర్ రెండో వారంలో హైదరాబాద్ లో దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
కేసీఆర్ సంచలన ప్రకటన
టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి, జిహెచ్ఎంసి డివిజన్ ఇంచార్జిల సంయుక్త సమావేశం ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతనరం తెలంగాణ భవన్ లో జరిగింది. సమావేశంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని, టిఆర్ఎస్ సంసిద్ధతను కేసీఆర్ వివరించారు.
కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం గడిచిన ఆరున్నరేళ్లలో దేశానికి చేసింది ఏమీ లేకపోగా, తప్పుడు ప్రచారాలతో, తప్పుడు విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నిష్క్రియా పరత్వ రాజకీయాల నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బిజెపి పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇతర పక్షాలపై పడిందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా ఆ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీల చేతుల్లో పెడుతున్నదని సిఎం ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సంఘీభావంగా ఉండి, పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యుద్ధం చేస్తామని ప్రకటించారు.
ఇప్పుడో ట్రెండ్….
దేశ రాజకీయాల్లో ఇప్పుడు భిన్నమైన ట్రెండ్ నడుస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. “ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ప్రజల కోసం ఏదీ చేయకుండా అన్నీ చేసినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. ప్రజల కోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపుతున్నది. సోషల్ మీడియాను యాంటీ సోషల్ మీడియాగా మార్చి అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. అభూత కల్పనలతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. దేశ ప్రజలను చైతన్య పరిచి బిజెపి, నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టిఆర్ఎస్ పోరాటం చేస్తుంది’’ అని సిఎం కేసీఆర్ చెప్పారు.
మోదీ ఏం చేయలేదు…
నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ఇప్పటి దాకా ప్రజల కోసం, రైతుల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలేదు అని కేసీఆర్ మండిపడ్డారు. “ చెప్పుకోవడానికి వారికి ఒక్క విషయమూ లేదు. ఎన్నికలప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికి పాకిస్తాన్, కాశ్మీర్, పుల్వామా అంటూ ప్రచారానికి దిగుతారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడతారు. ప్రజలను మత పరంగా విభజించే ప్రయత్నం చేస్తారు. మత కల్లోలాలను రేపి ఎన్నికల్లో లబ్ధి పొందుతారు. అంతే తప్ప దేశం కోసం, ప్రజల కోసం వారు ఏ ఒక్క పని చేయలేదు. సరిహద్దుల్లో ఏదో యుద్ధం చేసినట్లు ప్రచారం చేసుకుంటారు. అదే చైనాకు వ్యతిరేకంగా కొట్లాడలేక చతికిల పడతారు. ఏదో చేసినట్లు తప్పుడు ప్రచారం మాత్రం జోరుగా చేసుకుంటారు. బేటీ బచావో, బేటీ పడావో లాంటి అందమైన నినాదాలతో ఊదరగొడతారు తప్ప వాస్తవానికి ఏ పని చేయరు. గులకరాల్ల డబ్బాను ఊపినట్లు వాళ్ల ప్రచారం ఉంటుంది’’ అని కేసీఆర్ విమర్శించారు.
నెహ్రూ నుంచి మోదీ వరకూ….
‘‘దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎంతో దూర దృష్టితో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పారు. వీటి వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతున్నది. కానీ బిజెపి ఆ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, పెట్టుబడులను ఉప సంహరించుకుని, వాటిని ప్రైవేటు-కార్పోరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నది. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ(Disinvestment) అనే ముసుగులో ప్రభుత్వ రంగ సంస్థలను ఖతం పట్టించే పని ప్రారంభించారు. వాజ్ పేయి ప్రభుత్వంలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే పెట్టారు. అరుణ్ శౌరిని దానికి మంత్రిని చేశారు. మొదటి సారిగా వాజ్ పేయి ప్రభుత్వం ఏడు ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులు ఉప సంహరించుకుంది. తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకుని బిజెపి విధానాలను కొనసాగించింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకంగా 23 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించింది. తద్వారా వాటిని ప్రైవేటు, కార్పోరేటు కంపెనీలకు అప్పగిస్తున్నది. నరేంద్రమోడీ ప్రభుత్వం కొత్తగా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ప్రారంభించక పోగా ఉన్న వాటిని మూసి వేసే ప్రయత్నం చేస్తున్నది. దీని వల్ల అటు దేశానికి, ఇటు ప్రజలకు, మరో వైపు అందులో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతున్నది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీపై కొత్త ఆరోపణ
‘‘నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేస్తున్నారంటే, ప్రైవేటు పరం చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ లాభాల్లో నడుస్తూ ప్రజలకు సేవలు, ప్రభుత్వాలకు నిధులు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేస్తున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద రైల్వే వ్యవస్థ, 65 వేల కిలోమీటర్ల నెట్ వర్క్ భారతీయ రైల్వేలకు ఉంది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది. ప్రతి రోజు కోట్లాది మందికి సేవలు అందిస్తున్నది. కరోనా సమయంలో కూడా రైల్వేలు సేవలు అందించాయి. అలాంటి రైల్వేలను ప్రైవేటు పరం చేసే అవసరం ఏమొచ్చింది? రైల్వే స్టేషన్ లో ఛాయి అమ్మిన అని చెప్పిన మోడీ ఇప్పుడు రైల్వే స్టేషన్లనే తెగనమ్ముతున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.