తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన విప్లవాత్మక నిర్ణయాన్ని పక్కన పెట్టేశారు. ఇంటా, బయట ఎదురవుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తలొగ్గి నిర్ణయం తీసుకున్నారు. మునుపటి విధానంలోనే ముందుకు పోవాలని డిసైడయ్యారు.
ఇదంతా ఆస్తుల రిజిస్ట్రేషన్ గురించి. నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మక పథకం ధరణి వివాదాస్పదం కావడం, అనంతర పరిణామాల ఫలితం.
ఏంటీ వివాదం
ఆస్తుల రిజిస్ట్రేషన్కోసం రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్, పంచాయతీ రాజ్ యాక్టుల్లో సవరణలు చేసింది. ఇది అసెంబ్లీలో ఆమోదం పొందడంతో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ లీడర్లు సంబురాలు జరుపుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని చట్టాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని గొప్పగా చెప్పుకున్నారు. అయితే, ధరణి వివాదం కావడంతో తెలంగాణ హైకోర్ట్ విచారణ చేపట్టింది. సర్వేలో అనవసర వివరాలు తీసుకోవడంతో పాటు డేటా సెక్యూరిటీపై అనుమానాలున్నాయని కోర్టు స్టే విధించింది. దీనివల్లే రిజిస్ట్రేషన్లు ఆగాయని సర్కారు చెప్పింది. అయితే రిజిస్ట్రేషన్లపై స్టే ఇవ్వలేదనీ, పాత విధానంలో చెసుకోవచ్చని కోర్టు చెప్పింది. దీంతో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ముందుకు వెళ్లాలో వెనక్కి వెళ్లాలో తేల్చుకోలేకపోయింది.
ట్రెండ్ సెట్టర్ అన్నారు…. వెనక్కు తగ్గారు
సీఎం కేసీఆర్ అక్టోబర్ 29న పోర్టల్ ప్రారంభిస్తూ ‘ధరణి పోర్టల్ ఓ ట్రెండ్ సెట్టర్’ అని ప్రకటించారు. ఇక నుంచి అన్ని రకాల ఆస్తుల క్రయవిక్రయాలు పావుగంటలో జరిగిపోతాయన్నారు. నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ధరణి ద్వారా మాత్రమే జరిపేందుకు ప్రభుత్వం పంచాయతీ, మున్సిపల్ యాక్టులను సవరించింది. ఇందుకోసం అక్టోబర్ 12, 13 తేదీలో అసెంబ్లీ, మండలిని ప్రత్యేకంగా సమావేశపరిచి సవరణ చట్టాలను ఆమోదించుకుంది. దీంతో ధరణి పోర్టల్ ద్వారా కాకుండా పాత పద్ధతిలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలు లేదు. అయితే ఒకవేళ పాత పద్ధతిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలని భావిస్తే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఫెయిలైనట్లుగా అంగీకరించాల్సి వస్తుందని ప్రభుత్వం భయపడుతోందనే టాక్ ఉంది. అంత గొప్పగా చెప్పిన ధరణి ద్వారా కాకుండా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిపితే సర్కారు పరువు పోతుందనే చర్చ జరిగింది. అయినప్పటికీ, కోర్టు ఆదేశాలతో ఆ నిర్ణయాలను మార్చి రిజిస్ట్రేషన్లు ఆమోదింపచేశారు.