గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పర్వంలో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. అధికార టీఆర్ఎస్ పార్టీ , ప్రతిపక్ష బీజేపీ గెలుపు కోసం చెమటోడుస్తున్నాయి. ఈ సమయంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ ప్రత్యేక రికార్డు సృష్టించారని చర్చ జరుగుతోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీచర్లకు డ్యూటీలు వేయకుండా దూరం పెట్టారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఎలక్షన్ డ్యూటీకి టీచర్లను దూరంగా పెట్టారు. దేశంలో ఏ సీఎం తీసుకోని విధంగా గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేసీఆర్కు ఆ డౌట్ వచ్చిందా?
2018 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డ్యూటీలు చేసిన టీచర్లు, ఇతర ఉద్యోగులు వ్యతిరేకంగా ఓట్లు వేశారని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో 2019లో జరిగిన ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా టీఆర్ఎస్ బీ ఫామ్ ఇచ్చేందుకు ఆయన ధైర్యం చేయలేదు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతు ఇచ్చిన ముగ్గురు అభ్యర్థులూ ఓడిపోయారు. మొన్నటి దుబ్బాక ఎలక్షన్స్ లోనూ టీచర్లు వ్యతిరేకంగా పని చేయడం వల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని కేసీఆర్ నమ్ముతున్నారు అనే ప్రచారం జరుగుతోంది.
రాబోయే సమయంలో…
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉంటుంది. పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఉండదు. ఆ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం చూస్తుందని, ఆ సమయాల్లో టీచర్లకే డ్యూటీలు వేస్తుందని పలువురు అంటున్నారు. వాస్తవానికి ఎన్నికల విధుల్లో ఎవరున్నా ఓటర్లను ప్రభావితం చేయలేరు. కానీ ఇప్పుడు టీచర్లను డ్యూటీలకు దూరంగా పెట్టడం ద్వారా ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేయగలుగుతారు. టీచర్లను ఇంట్లో ఉంచడం ద్వారా పోలింగ్ బూత్ కు వచ్చి వ్యతిరేకంగా ఓటేసే చాన్స్ ఇచ్చారు.