తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు తన చాణక్యానికి పదునుపెట్టారని ప్రచారం జరుగుతోంది. గత కొద్దికాలంగా ఆయన తన రాజకీయ ఎత్తుగడలను పక్కనపెట్టగా మళ్లీ వాటిని ముందుకు తెస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసకున్న నిర్ణయంపై ఈ చర్చ జరుగుతోంది. తాజాగా నిర్వహించిన సమావేశం దీనికి అద్దం పడుతోంది.
వాళ్లతో ప్రత్యేకంగా…
హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో క్రిస్టియన్ మతపెద్దలతో టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, సికింద్రాబాద్ బిషప్ తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి. వినోద్ కుమార్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ లో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.
క్రైస్తవుల కోసం…
క్రిస్టియన్ల సమస్యల పరిష్కారం విషయంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని వినోద్ కుమార్ చెప్పారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని క్రిస్టియన్లు చర్చిల్లో ప్రార్థనలు చేశారని తెలిపారు. క్రిస్మస్ను రాష్ట్ర పండుగగా గుర్తించింది సీఎం కేసీఆర్ ఒక్కరేనని వెల్లడించారు. గ్రామాల్లో చర్చిల నిర్మాణానికి పంచాయతీ అనుమతి సరిపోతుందని ప్రభుత్వం జీవో ఇవ్వడం సంతోషకరమని వెల్లడించారు. స్మశాన వాటికలకు స్థలం కూడా ఉదారం గా కేటాయిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. క్రైస్తవులకు తెలంగాణ లో అన్ని విధాల మేలు జరుగుతోందని, ఇకముందు కూడా ఇది కొనసాగుతుందని వెల్లడించారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 204 రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రారంభించగా ఇందులో ఎనిమిది వేల క్రైస్తవ పిల్లలు చదువుకుంటున్నారని మంత్రి వప్రకటించారు. క్రైస్తవ సంస్థల ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతామని తెలిపారు.
కేటీఆర్ కీలక వ్యాఖ్యలు…
దేశ ,రాష్ట్ర అభివృద్ధిలో క్రైస్తవ సమాజం పాత్ర చాలా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. `నేను పుట్టింది మిషన్ ఆస్పత్రిలోనే. నేను ఏడు పాఠశాలలు మారినా ఎక్కువ కాలం చదువుకుంది మిషనరీ స్కూల్ లోనే. విద్యా ,వైద్య రంగం లో మిషనరీల పాత్ర ను ఎవరూ కాదనలేరు. ఈ కరోనా సమయం లోనూ మిషనరీ ఆస్పత్రులు సమర్ధ పాత్ర పోషిస్తున్నాయి.“ అని తెలిపారు. సీఎం కేసీఆర్ మాటల సెక్యులరిస్టు కాదు గుండెల నిండా సెక్యూలరిస్ట్ అని కేటీఆర్ ప్రకటించారు. `తాను హిందూ మతంలో పుట్టానని కేసీఆర్ గర్వంగా చెప్పుకుంటారు ..అదే సమయం లో ఇతర మతాలను అదే స్థాయి లో ఆదరిస్తారు` అంటూ తన తండ్రి ఆలోచన దోరణిని, విధానాలను ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు. “తెలంగాణ వస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని కొందరు రెచ్చగొట్టారు. గత ఆరేళ్లలో ఒక్క సంఘటన జరగలేదు. క్రైస్తవులతో పాటు అందరికీ రాష్ట్రం లో పూర్తి భద్రత ఉంటుంది. క్రిస్టియన్ భవన్ ను త్వరలోనే పూర్తి చేస్తాం. క్రైస్తవుల సమస్యల పరిష్కారం పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్ధి తో ఉంది. తెలంగాణ లో క్రైస్తవ సలహా సంఘం ఏర్పాటు చేయాలనీ నేను కూడా మంత్రి ఈశ్వర్ ను కోరుతున్నాను. `అని కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ దేశ ప్రధానికి చెప్పిన అభివృద్ధి ఫార్ములానే తెలంగాణ లో అమలు చేస్తున్నారు అని అన్నారు.
ఇప్పుడెందుకు సమావేశం?
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే వివిధ అభివృద్ధి పనులతో అధికార పార్టీ దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో కీలకమైన వర్గాలకు సైతం ఆ పార్టీ నేతలు చేరువ అవుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ క్రైస్తవ సంఘాలతో సమావేశం అయ్యారు. తమ పార్టీ, ప్రభుత్వ విధానాలను వెల్లడించారు. అయితే, ఈ సమావేశంపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.