(హైదరాబాద్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రెవెన్యూ శాఖలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విఆర్ఒల వ్యవస్థను రద్దు చేశారు. విఆర్ఒల నుండి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
రెవెన్యూశాఖలో పేరుకుపోయిన అవినీతి ప్రక్షాళనకు విఆర్ఒ వ్యవస్థను కెసిఆర్ సర్కార్ రద్దు చేయనున్నదని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి వీరిని పంచాయతీరాజ్ లేదా వ్యవసాయ శాఖలో విలీనం చేయాలనే ప్రతిపాదన ఉన్నది. రెవెన్యూశాఖలో పని చేస్తున్న దిగువ స్థాయి సిబ్బందిలో పేరుకుపోయిన అవినీతి రెవెన్యూ వ్యవస్థకే ప్రమాదమని సిఎం కెసిఆర్ గతంలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇటీవల కీసరలో రెవెన్యూ శాఖ అధికారుల కోటి 10 లక్షల అవినీతి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఆర్ఆర్ హయాంలో తాలూకా వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత మండల రెవెన్యూ కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలోనే పట్వారీ (కరణీకం) వ్యవస్థలను రద్దు చేశారు. వారి స్థానంలో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించింది. తొలుత విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లుగా ఆ తరువాత విలేజ్ రెవెన్యూ అధికారులు (విఆర్ఒ)లుగా పేరు మార్పు చేశారు.
కొత్త రెవెన్యూ చట్టంకు సంబంధించిన ముసాయిదా బిల్లును నేటి నుండి జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. కొత్త రెవెన్యూ చట్టం అమలు దిశలో భాగంగా ముందుగా విఆర్ఒల నుండి రికార్డులను ఈ సాయంత్రంలోగా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.