KCR : తెలంగాణ సీఎం మార్పు ఉండబోతోందంటూ జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తెర దించారు.
గత నెల రోజులుగా కెసిఆర్ తనయుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కాబో తున్నారంటూ విపరీతమైన ఊహాగానాలు సాగడం తెలిసే ఉంటుంది.సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ ఈ తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు.వెంటనే పలువురు ఎమ్మెల్యేలు క్యూ కట్టారు.కెటిఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ కోరస్ పాడారు.ఒక మంత్రి అయితే కేటీఆర్ సమక్షంలోనే కాబోయే సీఎం అంటూ సంభోదించి సంచలనం రేపారు.చివరకు కెటిఆర్ కేబినెట్లో ఎవరెవరికి స్థానం లభిస్తుందో కూడా విశ్లేషణలు సైతం సైతం సాగాయి.రథసప్తమి రోజు అంటే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన కెటిఆర్ పట్టాభిషేకం గురించి కేసీఆర్ ప్రకటిస్తారని జ్యోతిష్కులు సెలవిచ్చారు.అయితే వారందరికీ షాక్ ఇస్తూ కెసిఆర్ ఆదివారం విస్పష్ట ప్రకటన చేశారు. సీఎంగా తానే కొనసాగుతానని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు.
KCR : నోరు కట్టేసుకోండి:ఎమ్మెల్యేలకు హెచ్చరిక
దీనిపై అనవసర ప్రచారం చేయొద్దంటూ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ను సీఎం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎంగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకు ముందే చెప్పినా ఎందుకు మళ్లీ దాని గురించి మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. నేతలెవ్వరు బయట ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని సీఎం సూచించనట్లు సమాచారం.త్వరలో 6 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టనున్నట్లు సమాచారం. ఏ జిల్లా వాళ్ళు ముందుకొస్తే అక్కడే సభ ఏర్పాటు చేస్తానని చెప్పారు.
ఇకపై సుడిగాలి పర్యటనలు!
ఈ నెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచించారు. మార్చ్ ఒకటి నుండి పార్టీ కమిటీల నియామకం ఉంటుందన్నారు. ఈ సారి జిల్లా ఇంఛార్జిలను నియమిస్తామన్నారు. 11 న మేయర్ ఎన్నికలకు అందరూ తెలంగాణ భవన్ నుండి ఎమ్మెల్యే అందరూ కార్పొరేటర్లతో కలిసి జిహెచ్ఎంసీ ఆఫీసుకు వెళ్ళాలని సూచించారు. సీల్డ్ కవర్ లో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. రెండు నెలల పాటు ప్రతి జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు.ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన తెరాసలో బాంబులా పేలింది.ప్రస్తుతం ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.